జాతీయ స్థాయిలో విజయం సాధించి అంతర్జాతీయ స్థాయికి అర్హత సాధించిన క్రీడాకారిణి సునంద జిల్లాకే గర్వకారణం అని కృష్ణా జిల్లా కలెక్టర్ డికె బాలాజీ పేర్కొన్నారు.
మచిలీపట్నానికి చెందిన యోగా సభ్యురాలు సిహెచ్. సునంద ఇటీవల మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జరిగిన 45 వ జాతీయస్థాయి అథ్లెటిక్ పోటీలలో పాల్గొని మూడవ స్థానం దక్కించుకున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నగరంలోని గాంధీ నగర్ లో గల ఉదయపు నడక మిత్రమండలి భవనంలో ఏపీ యోగాసభ వారిచే నిర్వహిస్తున్న యోగా తరగతుల అనంతరం జిల్లా కలెక్టర్ క్రీడాకారిణి సునందను అభినందించి, ఘనంగా సత్కరించారు. కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని, పతకాన్ని ఆమె స్వీకరించారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం యోగా సంస్థ – ఎపి యోగ సభ నుంచి ఒక మహిళ విదేశాల్లో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించడం హర్షణీయం అని అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా విజయం సాధించి మచిలీపట్నానికి, జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకుని రావాలని కలెక్టర్ అభిలషించారు.
యోగా సభ్యులు అందరూ హర్షధ్వానాలతో సునందను అభినందించారు.