MachilipatnamLocal News
September 5, 2026
కృష్ణా జిల్లా

పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • December 19, 2025
  • 0 min read
పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
 జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
 
      శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, డిఆర్ఓ కె చంద్రశేఖర రావులతో కలిసి పరిశ్రమలు తదితర అంశాల పురోగతిపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
 
       ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏపీఐఐసీ ద్వారా గత 2 సంవత్సరాల లోపు మల్లవల్లి, వీరపనేని గూడెం పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అనుమతులు పొంది ఇంకా యూనిట్లను ప్రారంభించని దాదాపు 400 మంది పారిశ్రామికవేత్తల జాబితా తయారుచేసి వారి యూనిట్లు వెంటనే నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ఈ నెల 30వ తేదీన వారితో ఒక సమావేశం నిర్వహించి అందరిని ప్రోత్సహించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని సంబంధిత శాఖల అధికారులకు ముందుగా తెలియజేయాలన్నారు.
 జిల్లాలోని 20 మంది జిల్లా అధికారులను ఎంపిక చేసి పరిశ్రమలు వేగంగా నెలకొల్పుటకు ప్రత్యేక అధికారులుగా నియమించాలన్నారు. అలాగే 2 సంవత్సరాలు దాటినప్పటికీ ఇంకను పరిశ్రమలు నెలకొల్పని వారికి ఎందుకు వాటిని రద్దు పరచకూడదో తెలియజేయాలంటూ నోటీసులు జారీ చేయాలన్నారు. 
 
         ఏపీఐఐసీ పేరు మీద భూములు ఉంటేనే మ్యుటేషన్ చేయడానికి వీలుంటుందని స్పష్టం చేస్తూ మ్యుటేషన్ జాబితా సిద్ధం చేసి ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇదివరకే మ్యుటేషన్ చేసి కూడా 22 ఏ జాబితాలో ఉంటే అటువంటి భూముల జాబితా సిద్ధం చేసి 22 ఏ జాబితా నుండి తొలగింపుకు చర్యలు తీసుకుంటామన్నారు. 
 
       ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ర్యాంపు పురోగతి సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యాపారం పెంచేందుకు సరైన మార్గ నిర్దేశం చేసే కన్సల్టెంట్లను గుర్తించాలన్నారు.
 
         కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎంఈజీపి, పీఎం ఎఫ్ ఎం ఈ పథకాల అమలులో పురోగతి సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పిఎం ఎఫ్ఎంఈ పథకం కింద బ్యాంకులలో 39 దరఖాస్తులు ఎటువంటి పురోగతి లేకుండా పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని వెంటనే పరిష్కరించి రుణాలు మంజూరు చేయాలన్నారు. కేవలం బ్యాంకు రుణాలు తీసుకొని వ్యాపారం చేయని వారికి సిఫారసు చేయరాదని, నిజంగా వ్యాపారం చేయాలని ఆసక్తి, తపనపడే వారిని గుర్తించి ప్రోత్సహించాలన్నారు.
 
      ఈ సమావేశంలో మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్డిఓ లు స్వాతి, జీ.బాలసుబ్రమణ్యం, బిఎస్ హేలా షారోన్, డి ఆర్ డి ఏ, డ్వామా, మెప్మా పిడీలు శివప్రసాద్, హరిహరనాథ్, సాయిబాబు, జడ్పీ డిప్యూటీ సీఎం ఆనంద్ కుమార్, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహలు, డీఐసీ జీఎం ఆర్ వెంకటరావు, ఏపీఐఐసీ జడ్ ఎం బాబ్జి, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, ఎల్డీఎం రవీంద్రారెడ్డి, మార్కెటింగ్ ఎడి నిత్యానందం, మార్క్ఫెడ్ డి ఎం మురళీకృష్ణ, తదితర అధికారులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *