పాఠశాలల్లో హాజరు, అభ్యసన ఫలితాలు మెరుగుపరచాలి: డిఈఓ యు.వి. సుబ్బారావు
* పదో తరగతి విద్యార్థులకు ‘మిషన్ మార్చ్ 2027’ కార్యాచరణ
* లేడీ ఆంప్తెల్, సీపీఎం హైస్కూళ్లలో క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు
మచిలీపట్నం:
చిలకలపూడిలోని లేడీ ఆంప్తెల్ హైస్కూల్ మరియు సీపీఎం హైస్కూళ్లలో శనివారం నిర్వహించిన క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలకు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) యు. వి. సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు, నాన్-లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని గణనీయంగా పెంచాలని సూచించారు. రాబోయే పదో తరగతి పరీక్షల దృష్ట్యా ‘మిషన్ మార్చ్ 2027’ కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.
ప్రతి పాఠశాలలోని విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా ‘లీప్’ (LEAP) యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని డిఈఓ పిలుపునిచ్చారు. అకడమిక్ క్యాలెండర్ను అనుసరిస్తూ వినూత్న బోధనా పద్ధతుల (Innovative Activities) ద్వారా విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడంలో క్లస్టర్ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నార్త్ మండల విద్యాశాఖాధికారి (MEO) ఎం. దుర్గాప్రసాద్, లేడీ ఆంప్తెల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, సీపీఎం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

