కృష్ణా యూనివర్సిటీ ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ పరీక్షా కేంద్రం మార్పు
మచిలీపట్నం:
కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి విజయవాడలో జరగబోయే ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ పరీక్షల కేంద్రాన్ని మార్చినట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి (కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్) ఆచార్య పి. వీరబ్రహ్మాచారి ఒక ప్రకటనలో తెలిపారు.
తొలుత ప్రకటించిన వివరాల ప్రకారం ఈ పరీక్షలు కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో జరగాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ కేంద్రాన్ని డాక్టర్ ఎన్టీఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్కు మారుస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ బందరు రోడ్డులోని ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఎదురు వీధిలో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్లోనే ఈ పరీక్షలన్నీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థులు, విద్యార్థులు ఈ మార్పును గమనించి, నిర్దేశిత కేంద్రానికి సకాలంలో హాజరుకావాలని కోరారు.

