కృష్ణా జిల్లా ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ శుక్రవారం స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
ట్రెజరీ కార్యాలయానికి విచ్చేసిన ఆమె, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసును సమగ్రంగా పరిశీలించారు. జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న మహిళను గత సంవత్సరం నుంచి సీనియర్ అకౌంటెంట్ లోకేశ్వరరావు వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐసిడిఎస్, హ్యూమన్ రైట్స్ విభాగాల ప్రతినిధులు, మహిళా ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించేందుకు లోకల్ కమిషన్ను ఆదేశించినట్లు, వారి నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని రాయపాటి శైలజ వెల్లడించారు.
ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక సేకరించిన వివరాల ప్రకారం, కార్యాలయం వెలుపల గత సంవత్సర కాలం నుండి తనపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు బాధితురాలు ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకుండా ఉన్నతాధికారులు, కేసును లోకల్ స్థాయి మహిళా కమిషన్ కు బదిలీ చేశారు. లోకల్ మహిళ కమిషన్ విచారణను నీరుగార్చే ప్రయత్నాలు జరగటంతో న్యాయం కోసం రాష్ట్ర మహిళా కమిషన్ను ఆశ్రయించాల్సి వచ్చిందని బాధితురాలు తెలిపింది.