వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగింత
మచిలీపట్నం:
ఏపీసిఓపిఎస్ యాప్ సాయంతో వృద్ధ మహిళను ఇనుగుదురుపేట పోలీసులు కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. వివరాలలోకి వెళితే మే నెల 21 వ తేదీ అర్ధరాత్రి సమయంలో నగరంలోని రాజుపేట రామాలయం సమీపంలో ఒక వృద్ధ మహిళ ఒంటరిగా కూర్చొని ఉన్నట్లు 112 కి కాల్ ద్వారా సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే ఇనగుదురు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను పరామర్శించారు.
సదరు వృద్ధ మహిళ తీవ్ర ఆందోళనలో ఉండటంతో తన పూర్తి చిరునామా వివరాలు తెలియజేయలేని పరిస్థితిలో ఉంది. కేవలం తన పేరు మాత్రమే వెల్లడించింది. అందిన సమాచారం ఆధారంగా పోలీసులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఏపీ సి ఓ పి ఎస్ యాప్ సాయంతో ఆమె కుటుంబ సభ్యుల వివరాలను గుర్తించారు. అనంతరం మహిళను సురక్షితంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. మహిళకు ఎలాంటి హాని జరగకుండా క్షేమంగా ఆమెను ఇనుగుదురుపేట పోలీసులు అప్పగించడంతో వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియచేశారు.

