ఈ దేశం లో మహిళల గురించి ఆలోచన చేసిన మొదటి వ్యక్తి డా. బిఆర్. అంబేడ్కర్ అని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ అన్నారు. మంగళవారం డా. బిఆర్. అంబేడ్కర్ 135 వ జయంతి వేడుకలను కృష్ణా విశ్వవిద్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం డా. బి ఆర్ అంబేడ్కర్ ఆనాడే హిందూకోడ్ బిల్లు రూపొందించారని వివరించారు. దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన డా. అంబేడ్కర్ అనేక గొప్ప రచనలు చేసి దేశానికి అందించిన మేధావి అని పేర్కొన్నారు.
నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన కష్టనష్టాలకు ఓర్చి ఉన్నత చదువులు చదివి విజ్ఞాన ఖని గా గుర్తింపు పొందారు అని వివరించారు. ప్రముఖ రచయిత, విశ్రాంత వాణిజ్యపన్నుల శాఖాధికారి బోనిగల రామారావు ప్రధానోపన్యాసం చేశారు. కార్యక్రమంలో జీవిత బీమా ఉద్యోగ సంఘ నాయకులు కిశోర్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వైకే సుందరకృష్ణ పలువురు సహాయ ఆచార్యులు, బోధనేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు. తొలుత డా. బిఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.