పురిటిగడ్డ హైస్కూల్ ప్లస్ విద్యార్థినులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ
చల్లపల్లి:
చల్లపల్లి మండలంలోని పురిటిగడ్డ హైస్కూల్ ప్లస్ బాలికా కళాశాలలో ద్వితీయ సంవత్సరం బైపిసి (Bi.P.C) చదువుతున్న 13 మంది విద్యార్థినులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. కళాశాలలో పీజీటీ (తెలుగు)గా పనిచేస్తున్న డా. ఓలేటి ఉమాసరస్వతి తన సొంత నిధులు రూ. 15,000 వెచ్చించి అన్ని సబ్జెక్టుల మెటీరియల్స్ను కొనుగోలు చేశారు. ఈ పుస్తకాలను ఇండియన్ బ్యాంక్ మేనేజర్ శరత్ చంద్ర చేతుల మీదుగా విద్యార్థినులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఇండియన్ బ్యాంక్ మేనేజర్ శరత్ చంద్ర మాట్లాడుతూ.. పురిటిగడ్డలో బాలికల కోసం ప్రత్యేకంగా కళాశాల ఉండటం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది ఈ గ్రామ అభివృద్ధికి నిదర్శనం. విద్యార్థినులు పాఠ్యపుస్తకాల్లోని విషయాలను కేవలం కంఠస్థం చేయకుండా, అర్థం చేసుకుని చదవాలి అని సూచించారు. అలాగే తన సొంత డబ్బుతో విద్యార్థినులకు అండగా నిలిచిన డా. ఓలేటి ఉమాసరస్వతిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ప్రధానోపాధ్యాయులు కె.బి.యన్. శర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది నాదెళ్ళ పావనేశ్వరి, చందనలక్ష్మి, తుంగలమణిమాధవి, రాజులపాటి శ్రీనివాసరావు, పూర్ణచంద్రరావు, చోటీరాణి తదితరులు పాల్గొన్నారు.

