చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు.. మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీ
మచిలీపట్నం:
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమాన్ని మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేర్ని కిట్టు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి జిల్లా కోర్టు సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు వందలాదిగా పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ర్యాలీ ప్రారంభానికి ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పేర్ని కిట్టు, అనంతరం నల్ల బెలూన్లు ఎగురవేసి కూటమి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ, బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరిట దోచుకోవడం తప్ప రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు. మెగా డీఎస్సీ పేరుతో ఉద్యోగాల విక్రయానికి పాల్పడిందని ఆరోపించిన ఆయన, రెండు సంవత్సరాల పాలనలో పెన్షన్ల మంజూరు, ఇళ్ల స్థలాల కేటాయింపు, వికలాంగుల పెన్షన్ల పంపిణీ వంటి హామీలు అమలు కాలేదన్నారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధించడం తప్ప కూటమి ప్రభుత్వం సాధించినది ఏమీ లేదని ఆరోపించిన పేర్ని కిట్టు, ప్రభుత్వ బెదిరింపులకు పార్టీ శ్రేణులు భయపడబోవని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రజల మద్దతుతో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, పార్టీ అధ్యక్షుడు వై. స్. జగన్ మోహన్ రెడ్డి ను ముఖ్యమంత్రిగా నిలబెట్టేందుకు కార్యకర్తలు చివరి రక్తపు బొట్టు వరకు శ్రమిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

