ఇంధన పొదుపులో భాగంగా నో వెహికిల్ డే
దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి
ప్రధాని, ముఖ్యమంత్రి సూచనల మేరకు సైకిల్పై పార్టీ కార్యాయానికి చేరుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం :
మన దేశం కోసం, మన ఆర్ధిక వ్యవస్థ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఏర్పడిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నో వెహికిల్ డే కార్యక్రమంలో భాగంగా ఇంటి నుండి మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలతో కలిసి సైకిల్పై చేరుకున్నారు. అనంతరం ఎలక్ట్రిక్ సైకిల్పై ఆర్ అండ్ బీ కార్యాలయానికి చేరుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. “ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచంలో పెద్ద ఎత్తున ఆయిల్ కొరత నెలకొంది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో ప్రతి ఒక్కరూ ఖర్చులు తగ్గించుకోవాలని, పెట్రోల్, డీజిల్, వంటనూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. అదే సమయంలో బంగారం కొనుగోలు, విదేశీ పర్యటనలను కూడా వాయిదా వేసుకోవాలని సూచించారు.
ప్రధాన మంత్రి గారి సూచనల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు, మంత్రి నారా లోకేశ్ గారు కాన్వాయ్ తగ్గించుకున్నారు. దేశ సౌభాగ్యం కోసం పొదుపు అవసరమని సూచించారు. అవసరమైన మేరకు మాత్రమే వాహనాలు వాడాలని, ప్రత్యామ్నాయంగా సైకిల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని సూచించారు. ప్రతి శుక్రవారం నో వెహికిల్ డే పాటించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఆ మనిర్ణయం మేరకు ఈ రోజు ఇంటి నుండి సైకిల్పై పార్టీ కార్యాలయానికి చేరుకున్నాం. వంట నూనెలను కూడా పొదుపుగా వాడుకోవాలి. సోలార్ వినియోగం పెంచాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి చెబుతూనే ఉన్నాం. సోలార్ వినియోగం ద్వారా ఇంధనం ఖర్చు భారీగా తగ్గనుంది.
దేశంలోని ప్రతి పౌరుడు కూడా నాదేశం – నా భద్రత నినాదంతో పొదుపు పాటించాలి. పెట్రోల్, డీజిల్, బంగారం వంటి వినియోగంలో నియంత్రణతో విదేశీ మారక ద్రవ్యం నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు నుండి అవసరం మేరకు మాత్రమే కార్లు వాడేలా పార్టీ నాయకులందరికీ సూచించాం. అవసరం ఉన్నపుడు మాత్రమే కార్లు వాడుతూ, మిగిలిన సమయంలో సైకిల్ వినియోగించడం ద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి తోడుగా నిలుస్తానని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

