కృష్ణాజిల్లాలో ఆక్వా చెరువులపై రైతుల ఆగ్రహం
మచిలీపట్నం:
వ్యవసాయ భూములే ముద్దు.. ఆక్వా చెరువులు వద్దు అంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా
కృష్ణాజిల్లాలో వ్యవసాయ భూములను ఆక్వా చెరువులుగా మార్చుతున్న చర్యలపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద పలు గ్రామాల రైతులు భారీగా తరలి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. “ఆక్వా చెరువులు వద్దు.. వ్యవసాయ భూములే ముద్దు” అంటూ నినాదాలు చేస్తూ ఆక్వా రైతులకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, పంట భూములను చెరువులుగా మార్చడం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతాయని, భవిష్యత్ తరాలకు ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆక్వా చెరువుల వల్ల నేల ఉప్పుదనం పెరిగి, పంటల దిగుబడి తగ్గిపోతుందని తెలిపారు. ఇటీవల అనుమతులు లేకుండా కొన్ని ప్రాంతాల్లో చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, వెంటనే వాటిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని కాపాడాలని, రైతుల జీవనాధారాన్ని రక్షించాలని అధికారులను కోరారు.
రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్రమ ఆక్వా చెరువులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

