నగరంలో స్వచ్ఛ సర్వేక్షన్ లో జిల్లా కలెక్టర్
మచిలీపట్నం:
నగరంలోని ప్రజలను చైతన్యపరచి ముమ్మరంగా స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొనేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్, మచిలీపట్నం నగరపాలక సంస్థ పాలనా ప్రత్యేక అధికారి డీకే బాలాజీ మునిసిపల్ అధికారులను ఆదేశించారు.
శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ తన సిబ్బందితో సహా ఎలక్ట్రిక్ సైకిల్ పై స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా నగరంలోని పలు వార్డులలో విస్తృతంగా పర్యటించి గ్రీన్ స్పాట్లను, చెత్తాచెదారాలు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యంగా 37, 38, 39 డివిజన్లలో పరాసుపేట, గాదె వారి వీధి, రుస్తుంబాద, కోనేరు సెంటరు, గొడుగుపేట, సర్వ వారి వీధి, తదితర ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. గ్రీన్ స్పాట్లను పూర్తిస్థాయిలో సరిగా అభివృద్ధి పరచలేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గోడలకు రంగులు పూర్తిగా వేయాలన్నారు. నగరంలో పారిశుద్ధ్య పనులు సజావుగా జరగడం లేదని ఇకనైనా చిత్తశుద్ధితో పనిచేసి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
వార్డు సచివాలయ సిబ్బందికి పారిశుద్ధ్య పర్యవేక్షణ బాధ్యత అప్పగించినప్పటికీ సరిగా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇకనైనా ప్రతిరోజు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. నగరాన్ని స్వచ్ఛ సుందర నగరంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించేది లేదని నిరంతరం తాను తనిఖీ చేస్తుంటానని మునిసిపల్ అధికారులు, సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇకనైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎక్కడ చెత్త లేకుండా కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలనీ ఆదేశించారు
నగరంలో చెత్త ఉన్నప్పుడు ఫోటో తీయాలని శుభ్రం చేసిన తర్వాత గ్రీన్సిపార్టుగా తీర్చిదిద్దాక కూడా ఫోటో తీసి తప్పనిసరిగా డాక్యుమెంటేషన్ చేయాలన్నారు. ప్రతి వీధిలోను ప్రజలతో మమేకమై వారిని భాగ్యస్వాములు చేసి చుట్టుపక్కల పరిసరాల లో చెత్త వేయకుండా వారిని బాధ్యత తీసుకునేలా చైతన్య పరచాలన్నారు. ఆ విధంగా చేసినవి స్థానిక ప్రజలకు చూపిస్తే ఇంకొంతమంది ప్రజలు గ్రీన్ స్పాట్లు తయారు చేసేందుకు ముందుకు వచ్చి తమ వంతు భాగస్వామ్యంగా పాల్గొంటారన్నారు.

