MachilipatnamLocal News
April 18, 2026
జిల్లా

సహకార రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు నూతన శకం.!

  • April 17, 2026
  • 0 min read
[addtoany]
సహకార రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు నూతన శకం.!
కేడీసీసీ బ్యాంక్ విజయగాథపై సీఎం చంద్రబాబుతో రఘురాం కీలక చర్చలు
 
మచిలీపట్నం : 
 
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని అమరావతి సచివాలయంలో మాజీ మంత్రి, ఉమ్మడి కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో సహకార బ్యాంకింగ్ రంగం బలోపేతం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, రైతు సంక్షేమం వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ గత కొన్నేళ్లలో సాధించిన ప్రగతిని వివరించిన చైర్మన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ 106 కోట్ల లాభాన్ని నమోదు చేసి స్థిరమైన వృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఇది బ్యాంక్‌పై ప్రజల విశ్వాసానికి, సమర్థవంతమైన నిర్వహణకు నిదర్శనమని పేర్కొన్నారు.
 
సహకార రంగంలో డిజిటల్ మార్పుకు కేడీసీసీ బ్యాంక్ నాంది పలికిందని చైర్మన్ వివరించారు. అన్ని జిల్లా సహకార బ్యాంకుల్లో తొలిసారిగా యూపీఐ సేవలను విజయవంతంగా అమలు చేసిన ఘనత కృష్ణా జిల్లా సహకార బ్యాంక్‌ కే దక్కిందని తెలిపారు. అలాగే 425 పిఎసిఎస్ సంఘాల 100% కంప్యూటరీకరణ పూర్తి కావడం ఒక చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. ఈ విజయానికి కృషి చేసిన సిబ్బందిని, అధికారులను, భాగస్వామ్య సంస్థలను ముఖ్యమంత్రి అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ బ్యాంకింగ్ విస్తరణకు ఇది మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు.
 
రైతు సంక్షేమంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. రైతులకు అందిస్తున్న అంత్యక్రియల సహాయం, వ్యక్తిగత ప్రమాద బీమా, ఇతర సంక్షేమ పథకాల అమలుపై వివరంగా తెలుసుకున్నారు. ఈ పథకాలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా,ప్రతి అర్హత గల కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
రైతు కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మరణించిన రైతుల కుటుంబాలకు వన్ టైం సెటిల్మెంట్ (ఓ టి ఎస్) ద్వారా వడ్డీ మాఫీ అమలు చేస్తున్నామని చైర్మన్ వివరించారు. ఈ చర్యల వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం లభిస్తోందని, సహకార బ్యాంకింగ్ రంగంపై విశ్వాసం మరింత పెరుగుతోందని తెలిపారు.
 
అదేవిధంగా, కృష్ణా జిల్లాలో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహిస్తున్న చెక్కుల పంపిణీ కార్యక్రమాల గురించి రఘురాం ప్రస్తావించారు. ఇప్పటికే జగ్గయ్యపేట, విజయవాడ ఈస్ట్, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయన్నారు. త్వరలోనే మిగతా నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలను విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం పెరుగుతోందని, దీని ఫలితంగా ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతోందని వివరించారు.
 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్యాంక్ పనితీరును అభినందిస్తూ, సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసి రైతులకు సులభమైన, పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత సేవలను అందించాలని సూచించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి వినూత్న కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
 
సహకార రంగ అభివృద్ధి, రైతు సంక్షేమం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా కేడీసీసీ బ్యాంక్ ముందుకు సాగుతోందని, ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కట్టుబడి ఉన్నామని నెట్టెం శ్రీ రఘురాం తెలిపారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *