కృష్ణా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జ్యోతిరావ్ పూలే 199 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వర్సిటీ ఉపకులపతి ఆచార్య కే రాంజీ మాట్లాడుతూ 19వ శతాబ్ద ప్రథమార్ధంలోనే నాటి బ్రిటిష్ పాలనలో అట్టడుగు వర్గాల కోసం పోరాడిన ఘనత నాటి సామాజిక తత్వవేత్త, సంఘసంస్కర్త అయిన మహాత్మ జ్యోతిరావు పూలేదని ఆయన కొనియాడారు.. భారతావనికి అత్యద్భుత రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ కూడా ఈయన్ని గురువుగా భావించేవారని, ముఖ్యంగా నాటి ఆడపిల్లలకి విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించి, తన సతీమణి సావిత్రిబాయి పూలే సహకారంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారి బాలికల కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాలను ఏర్పాటు చేసి వాళ్లను విద్యావంతులను చేయడానికి కంకణం కట్టుకున్నారని చెప్పారు.
ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుందర కృష్ణ మాట్లాడుతూ నాటి కాలంలో భారతదేశంలో కులవివక్ష బహుళంగా ఉండేదని, దాన్ని రూపుమాపడానికి ముందుకొచ్చిన నాటితరం వారిలో ఈయన అత్యంత ప్రముఖుడన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా. పి గోపి, ఆర్ దుర్గాప్రసాద్, కె కవిత, రంగశ్రీ ఇతర బోధనా సిబ్బంది పాల్గొన్నారు.