జెండా ఊపి దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించిన ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు
SSN
- March 18, 2026
- 0 min read
[addtoany]
మచిలీపట్నం:
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగశక్తి పథకాన్ని ప్రవేశపెట్టి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి ఎంతో లబ్ధిని చేకూర్చిందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు.
బుధవారం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మచిలీపట్నం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో దివ్యాంగశక్తి పథకం – ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివ్యాంగ ప్రయాణికుల ఆర్టీసీ బస్సుకు జండా ఊపి పథకాన్ని ప్రారంభించారు. దివ్యాంగులతో కలిసి బస్సులో చిన్నాపురం వరకు ప్రయాణించారు. అనంతరం ఆయన మచిలీపట్నంలోని రహదారులు భవనాల అతిథి గృహానికి చేరుకొని దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా బస్టాండ్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన సభలో చైర్మన్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పాటైన ప్రభుత్వాలలో స్త్రీలు, దివ్యాంగులను గొప్పగా పట్టించుకున్న ప్రభుత్వం కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం స్త్రీలు, దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎంతో లబ్ది చేకూర్చిందన్నారు. స్త్రీలకు స్త్రీ శక్తి పథకంతో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా వారిలో చైతన్యం వచ్చిందని, వారు ఉద్యోగాలు, చదువులు, దైవ దర్శనాలు, బంధువులను కలవడం చేస్తున్నారని, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్త్రీలకు ఎంతో ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చిందని గుర్తు చేశారు. గతంలో 33 శాతంగా ఉన్న స్త్రీల ప్రయాణం, స్త్రీ శక్తి పథకంతో 67 శాతానికి చేరుతుందని, మొత్తంగా 52 కోట్ల మంది పథకాన్ని వినియోగించుకున్నట్లు తెలిపారు. పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 1,826 కోట్లకు పైగా ఖర్చును భరించినట్లు చెప్పారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం భారంగా భావించకుండా స్త్రీ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని అన్నారు. ఇదే క్రమంలో మరో అడుగు ముందుకేసి దివ్యాంగుల సంక్షేమం కోసం ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులలో ప్రయాణించవచ్చని, నాన్ స్టాప్, సప్తగిరి ఎక్స్ప్రెస్, అంతర్ రాష్ట్ర సర్వీసుల్లో 50 శాతం రాయితీతో ప్రయాణించవచ్చని వివరించారు. దృష్టిలోపం నూరు శాతం, మేధో వైకల్యం 40 శాతం ఉన్నవారికి వారి సహాయకులకు సైతం 50 శాతం రాయితీ వర్తించనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ తెలిపారు. దివ్యాంగులకు గతంలో రద్దయిన 4 శాతం రిజర్వేషన్లు తిరిగి ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వర్లు, మచిలీపట్నం డిపో మేనేజర్ పెద్దిరాజు, ప్రత్యేక అధికారి నిత్యానంద్, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి కామరాజు, మచిలీపట్నం మార్కెట్ యార్డు చైర్మన్ కుంచె దుర్గా ప్రసాద్ (నాని), పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు కొనకళ్ళ జగన్నాథరావు ( బుల్లయ్య), పీవీ గజేంద్రరావు, లోగిశెట్టి స్వామి, గడ్డం రాజు, లంకే శేషగిరి, సోడిశెట్టి బాలాజీ తదితర కూటమి నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

