ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించి మోసపోయామంటున్న బాధితులు
మచిలీపట్నం :
రైల్వే డిపార్ట్మెంట్ లో అనౌన్సర్ గా ఉద్యోగం ఇప్పిస్తానని తన దగ్గర 3.5 లక్షలు కట్టించుకున్నారని చిలకలపూడి కి చెందిన వేగేసిన గంగాభవాని ఆరోపించారు. బుధవారం మచిలీపట్నానికి చెందిన మొగనాటి కిషోర్ కుమార్ ఇంటి వద్ద మరో బాధిత మహిళ తో కలిసి ఆందోళన చేస్తూ పాత్రికేయులతో మాట్లాడారు.
రైల్వే ఐడి కార్డులు, అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడంతో నిజమైనవే అనుకుని నమ్మి మోసపోయినట్లు చెప్పారు. ఈ వ్యవహారం లో రాజకీయ నాయకులకు ప్రమేయం ఉందన్నారు. చిన్నం చిన్న అనే వ్యక్తి తాను కౌన్సిలర్ నని చెప్పి పరిచయం చేసుకుని, పార్టీలో ఉన్నామని, తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి, ఓపిక పట్టండి అంటూ తమతో ఫోన్లో వీడియో కాల్ చేస్తూ మాట్లాడినట్టు చెప్పారు.
మూడు సంవత్సరాలుగా కాలయాపన చేయడంతో పది రోజుల క్రితం మా డబ్బులు ఇచ్చేయాలని ఇదే ఇంటికి వచ్చి పట్టు బడితే ఆయన ఆసుపత్రి లో పడుకుని, ఇంటి ముందు (కిషోర్ ఇంటి వద్ద) గొడవ చేస్తున్నారంటూ తిరిగి మా పైన, మా తల్లితండ్రుల మీద కేసు పెట్టారని వాపోయారు. మాతో పాటు పామర్రు, ఇనకుదురు, మొగల్తూరు, నరసాపురం, పాలకొల్లు, భీమవరం కాళ్ళ మండలం ప్రాంతాలకు చెందిన 15 మంది దగ్గర డబ్బులు వసూలు చేశారని తెలిపారు.
చిలకలపూడి పోలీసు స్టేషన్ లో మమ్మల్ని ఉద్యోగాల పేరుతో మోసం చేశారని పిర్యాదు చేశామని, పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పటమే గాని పట్టించుకున్నది లేదన్నారు. ఇప్పటికైనా డబ్బులు ఇస్తే చాలని మీడియా ద్వారా తమ గోడు వెల్లడిస్తున్నామన్నారు.