మచిలీపట్నం :
సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖ లో అత్యున్నత సేవలు అందించి, బుధవారం పదవీ విరమణ చేయుచున్న పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి నాయుడు , ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ తో కలిసి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.
పదవీ విరమణ చేయుచున్న సిబ్బంది వివరాలు.
ఎస్సై – 133 ఎం. ప్రేమ్ కుమార్ గన్నవరం పోలీస్ స్టేషన్
ఎస్సై – 309 కె. సాంబశివరావు సిసిఎస్ మచిలీపట్నం.
ఏ ఎస్ ఐ- జి. ఉమామహేశ్వరరావు ఆర్ పేట పోలీస్ స్టేషన్
ముందుగా పదవీ విరమణ చేయుచున్న సిబ్బందికి శాలువాలు ,పూలదండలతో సత్కరించివారి కుటుంబ సభ్యులు, సిబ్బంది సమక్షంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ కుటుంబంతో కంటే పోలీస్ శాఖ లోకి ప్రవేశించిన నాటి నుండి నేటి వరకు అహర్నిశలు ప్రజాక్షేమం కోసం కృషి చేసి, గౌరవ ప్రదంగా, మర్యాద పూర్వంగా పదవి విరమణ పొందడం అదృష్టమని, ఇలా పదవీ విరమణ పొందడం బాధగానే ఉంటుందని, జీవితంలో ఉద్యోగం అన్న తరువాత పదవి విరమణ పొందడం కూడా ఉంటుందని, ఉద్యోగంలో మొదటి రోజు ఎలా సంతోషంగా ఉంటామో చివరి రోజున కూడా అంతే ఉత్సాహంగా ఉండాలని, సెలవులు ఉన్నా తీసుకోలేని పరిస్థితిలో కూడా డ్యూటీ చేస్తూ బందాలకు, అనుబంధాలకు, ముఖ్యమైన కార్యక్రమాలకు దూరమై, ఎన్నో భాధలు, బాధ్యతలు ఉన్నా అన్నిటిని మరిచిపోయి పోలీస్ ఉద్యోగాన్ని ప్రతి క్షణం ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ పోలీస్ వ్యవస్థకు మంచి సేవలు అందించిన మిమ్మల్ని డిపార్టుమెంటు మరిచిపోదని తెలిపారు.
పదవి విరమణ పొందిన తరువాత మీ కుటుంబ సభ్యులతో మిగిలిన శేష జీవితాన్ని సుఖ సంతోషాలతో గడుపుతారని ఆశిస్తున్నాను. పదవి విరమణ పొందిన తరువాత కూడా మీకు ఏదైనా సమస్యలు వస్తే పోలీస్ శాఖ తలుపులు ఎప్పుడూ తెరిచే వుంటుందని మీ సమస్యలను పరిష్కరించడంలో ముందు ఉంటామని, మిగిలిన మీ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో బంధు మిత్రులతో ఆనందమయంగా గడపాలని, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వై. సత్య కిషోర్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్ రవికిరణ్ , ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.