సైన్స్ ఫెయిర్తో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందుతుంది
* నిర్మల హైస్కూల్లో ఘనంగా 50వ సైన్స్ ఫెయిర్
* విద్యార్థుల శాస్త్రీయ నమూనాలు, సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన
* ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు
మచిలీపట్నం:
మచిలీపట్నంలోని నిర్మల హైస్కూల్లో 50వ సైన్స్ ఫెయిర్ను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు మరియు NFSA బృందం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రదర్శనకు కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులు రూపొందించిన వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలు మరియు సైన్స్ ప్రాజెక్టులను తిలకించారు.
విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు పరిశీలన, పరిశోధన, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సైన్స్ ఫెయిర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ప్రాజెక్టుల పనితీరు, వాటి ఉపయోగాలు, వినూత్న శాస్త్రీయ అంశాలను అతిథులకు వివరించారు. విద్యార్థుల సృజనాత్మకతను, ప్రదర్శించిన నమూనాలను అతిథులు ఎంతగానో అభినందించారు.
పాఠశాల హెచ్ఎం సిస్టర్ సుధా సూసై మాట్లాడుతూ, విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకాల పరిజ్ఞానమే కాకుండా శాస్త్రీయ దృక్పథాన్ని అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సైన్స్ ఫెయిర్ వంటి వేదికలు విద్యార్థులు తమ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) అడిషనల్ జనరల్ మేనేజర్ ఏ.ఈ. శ్రీనివాసరావు, నిర్మల ఇన్స్టిట్యూషన్స్ కౌన్సిలర్ రెవ. సిస్టర్ గిబి ఆంటోనీ, ఎంటీఎం పారిష్ ప్రీస్ట్ ఫాదర్ బి. ఆనంద్ బాబు పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల కృషి ఫలితంగా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాభిమానులు సైన్స్ ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు.

