మచిలీపట్నంలో వరుస దొంగతనాల ముఠా గుట్టురట్టు: ముగ్గురు అరెస్ట్, బాలుడు అదుపులోకి
మచిలీపట్నం:
చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 1న హౌసింగ్ బోర్డు కాలనీలో, ఆగస్టు 18న చిలకలపూడి కొత్తపేటలో జరిగిన దొంగతనాల కేసుల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మచవరం మెట్టు మరియు రెడ్ పీచ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల గుట్టు రట్టయింది.
ఈ కేసులో గంట తరుణ్ కుమార్ (24), గొరిపర్తి సాయి కుమార్ అలియాస్ సాయి (26), విన్నకోట దినేష్ కుమార్ (22)లను అరెస్ట్ చేయగా, 17 ఏళ్ల బాలుడిని చట్ట ప్రకారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 54.176 గ్రాముల బరువున్న రెండు వెండి కుందులు, రెండు వెండి ప్లేట్లతో పాటు 43.824 గ్రాముల బరువున్న బంగారు ఉంగరం, రెండు వెండి ఉంగరాలు, వెండి గొలుసు, బంగారు రంగు చేతి గడియారం, బజాజ్ ప్లాటినా ద్విచక్ర వాహనం (AP40Q-5420), మూడు సెల్ఫోన్లు మరియు ఒక మోటార్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో గుడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల్లో కూడా ఈ ముఠా ప్రమేయం ఉన్నట్లు వెల్లడవ్వడంతో, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

