రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు డా. ఓలేటి ఉమా సరస్వతికి మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు
మచిలీపట్నం:
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత డాక్టర్ ఓలేటి ఉమాసరస్వతిని రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల చేతుల మీదుగా ఆమె ఈ ప్రతిష్టాత్మక ‘స్టేట్ బెస్ట్ టీచర్’ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఉమాసరస్వతి మంత్రిని కలవగా, ఆమెను పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… మన మచిలీపట్నం వాసి అయిన ఉమాసరస్వతి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడం నియోజకవర్గానికే కాకుండా జిల్లా మొత్తానికి గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆమె విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందిస్తూ, విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ‘శ్యామ్ గోల్డ్’ అధినేత ధవళేశ్వరపు ఉమామహేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది పేరంబాకం దేవేంద్ర కుమార్ తదితరులు పాల్గొని డా. ఉమాసరస్వతికి అభినందనలు తెలిపారు.

