జిల్లాలో కావలసినంత డీజిల్, పెట్రోలు అందుబాటులో ఉందని ఎవరూ కూడా అవి దొరకవని
భయపడవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ వీ విద్యాసాగర్ నాయుడు, శిక్షణలో ఉన్న కలెక్టర్ నమ్రత అగర్వాల్, డీఎస్ఓ మోహన్ బాబు లతో కలసి జిల్లాలో డీజిల్, పెట్రోలు స్థితిగతులపై పాత్రికేయుల సమావేశం నిర్వహించి గణాంకాలతో సహా వివరించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సాధారణంగా పెట్రోలు 2 నుంచి 2.5 లక్షలు లీటర్లు వచ్చేదన్నారు.. ఈరోజు సోమవారం ఒక్క రోజే కృష్ణా జిల్లాలో ఉదయం నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ అయితే 4,30,000 లీటర్లు వచ్చిందన్నారు. అంటే సగటున ప్రతిరోజు వచ్చే 2 నుంచి 2.5 లక్షల కన్నా దాదాపు 2 లక్షలు లీటర్లు ఎక్కువ పెట్రోల్ రావడం జరిగిందన్నారు.
అదేవిధంగా డీజిల్ 3 నుంచి 3.5 లక్షలు లీటర్లు సగటున ప్రతిరోజు మన జిల్లాకు వచ్చేదన్నారు. డీజిల్ ఈ ఒక్క రోజే మనకు ఇప్పటికే 4,59,000 లీటర్లు వచ్చేసిందన్నారు. ఇంకా ట్యాంకర్లు వస్తున్నాయన్నారు. డీజిల్ , పెట్రోల్ సరఫరా లేదనే భయాందోళనతో దయచేసి కొనుగోలు చేయవద్దన్నారు. ఆ విధంగా భయాందోళనతో కొనుగోలు చేసినప్పుడే సమస్య ఇంకా పెద్దది చేసినట్టు అవుతుందన్నారు.
ఈరోజు ప్రతిరోజు కన్నా 2 లక్షల అదనపు లీటర్లు పెట్రోల్ వచ్చిందన్నారు. ఒక లక్ష లీటర్లు అదనపు డీజిల్ వచ్చిందన్నారు. ఇంకా వస్తుందన్నారు. ఇటువంటి సమయంలో ఎంత హేతుబద్ధంగా వ్యవహరిస్తామో అంతగా మనం ఇతర ప్రజలకు ప్రభుత్వానికి సహాయం అందించిన వారమవుతామన్నారు.