MachilipatnamLocal News
April 29, 2026
మచిలీపట్నం

కరగ్రహారం హౌసింగ్ లేఔట్ అభివృద్ధికి చర్యలు: మంత్రి కొల్లు రవీంద్ర

  • April 25, 2026
  • 1 min read
[addtoany]
కరగ్రహారం హౌసింగ్ లేఔట్ అభివృద్ధికి చర్యలు: మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం :
 
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హౌసింగ్ స్కీమ్ కింద కరగ్రహారం ప్రాంతంలో చేపట్టిన నివేశన స్థలాల అభివృద్ధి పనులను వేగవంతం చేసి, లబ్ధిదారులందరికీ అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
 
శనివారం మధ్యాహ్నం మచిలీపట్నం మండలం కరగ్రహారం పంచాయతీలోని హౌసింగ్ లేఔట్‌ను మంత్రి సందర్శించి, నిర్మాణంలో ఉన్న గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిర్మాణాలు పూర్తి చేసుకున్న కొంతమంది లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గృహ నిర్మాణం, విద్యుత్, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. లబ్ధిదారుల గుర్తింపు, ప్లాటింగ్, మౌలిక వసతుల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని పేర్కొన్నారు. ప్రాంతంలో మట్టి పనుల్లో అవకతవకలు జరిగాయని, తక్కువ మట్టి తోలించి అధిక బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే విచారణ జరుగుతోందని తెలిపారు.
 
కరగ్రహారం లేఔట్ లో మొత్తం 15,998 గృహాలలో కేవలం 804 గృహాలే పూర్తయ్యాయని, 5-6 శాతం కూడా పూర్తి కాలేదని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా డి-బ్లాక్‌లో 927 ప్లాట్లకు గాను కేవలం 74 గృహాలు మాత్రమే పూర్తి అయ్యాయని, అందులో కూడా కేవలం 16 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయని తెలిపారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి కనీస సదుపాయాలు కూడా లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.
 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హౌసింగ్ లబ్ధిదారులకు మరింత సహాయం అందిస్తున్నామని తెలిపారు. గతంలో రూ.1.80 లక్షలు మాత్రమే ఇచ్చిన గృహ నిర్మాణ సహాయాన్ని ఇప్పుడు పెంచి, ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు అదనంగా రూ.50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేలు అదనంగా ఇస్తున్నామని చెప్పారు. దీంతో మొత్తం సహాయం రూ.2.30 లక్షలు (ఎస్సీ/బీసీ), రూ.2.55 లక్షలు (ఎస్టీ) వరకు లభిస్తుందని తెలిపారు.
 
ప్రస్తుతం నిర్మాణం ప్రారంభించిన 2,443 గృహాలను సెప్టెంబర్‌లోపు పూర్తి చేస్తే ఈ పెరిగిన ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉందన్నారు. అలాగే స్పందించని కారణంగా డిసేబుల్ అయిన 9,848 గృహాలను మళ్లీ అర్హత జాబితాలోకి తీసుకువచ్చి, కొత్త స్కీమ్ కింద ప్రయోజనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
 
కరగ్రహారం లేఔట్‌లో రహదారులు, తాగునీరు, విద్యుత్, లైటింగ్ వంటి మౌలిక వసతులను దశలవారీగా పూర్తి చేయడానికి అవసరమైన నిధులను సమీకరించి పనులు చేపడుతున్నామని చెప్పారు. సచివాలయ ఎమెనిటీ సెక్రటరీల ద్వారా డివిజన్ల వారీగా లబ్ధిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి, ఒక ఏడాది లోపు అన్ని గృహ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తూ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని స్పష్టం చేశారు.
 
కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ పీడీ వెంకట్రావు, డిఇ బుజ్జిబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గుమ్మడి విద్యాసాగర్, మచిలీపట్నం నార్త్ మండలం తహసిల్దార్ నాగభూషణం, ఎంపీడీవో బాలకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మెండు సుగుణ కుమారి, పంచాయతీరాజ్ ఏఈ హరిబాబు, కూటమి నాయకులు వాలిశెట్టి తిరుమలరావు, రామగాని రత్నాకర్, వెంకటేశ్వరరావు, సోమశేఖర్, మధు తదితర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *