డయాబెటిస్ బాధితులు జాగ్రత్తలు పాటించాలి: డాక్టర్ శ్రీకాంత్ రాజు
మచిలీపట్నం:
డయాబెటిస్ బాధితులు తమ ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన తో ఉండాలని, అవగాహన లేకపోతే కాలు కోల్పోయే ప్రమాదం ఉందని యశోద హాస్పిటల్స్ చీఫ్ హెడ్ డాక్టర్ శ్రీకాంత్ రాజు అన్నారు. స్థానిక ఈశ్వర్ రెసిడెన్సి లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డయాబెటిస్ రోగుల్లో కాళ్లకు రక్తప్రసరణ తగ్గే సమస్య అయిన పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ పై డయాబెటిస్ రోగులకు అవగాహన అత్యవసరమని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ సీనియర్ కన్సల్టెంట్, వాస్క్యులర్ సర్జన్, ఎండో వాస్క్యులర్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ శ్రీకాంతరాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ డయాబెటిస్ రోగుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండి చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారే ప్రమాదం ఉందన్నారు. నరాల సమస్య కారణంగా కొందరిలో నొప్పి తెలియకపోవచ్చు అని హెచ్చరించారు. నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి రావడం, కాళ్ళు త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండడం, మానని గాయాలు ఏర్పడడం, వేళ్ళు నల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సకాలంలో కాళ్ల రక్తప్రసరణ పరీక్షలు, డాప్లర్ స్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ముందుగానే గుర్తించి చికిత్స చేయవచ్చు అన్నారు. డయాబెటిస్ రోగులు రక్తంలో చక్కెర స్థాయిని కట్టుదిట్టంగా నియంత్రించుకోవాలని పొగ తాగడం పూర్తిగా మానుకోవాలని సూచించారు. అవసరమైతే మందులు, యాంజియో ప్లాస్టి వంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజు పాదాలను పరిశీలించడం చిన్న గాయాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం ద్వారా పాదాలను కోల్పోయే ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు అన్నారు. ముందస్తు అవగాహన, సకాలంలో చికిత్సతో కాలుకోల్పోయే ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చని దీనిపై భయపడవలసిన పనిలేదని డాక్టర్ శ్రీకాంత్ రాజు స్పష్టం చేశారు. మితాహారం, మిత వ్యాయామం, అత్యంత ఆవశ్యకం అన్నారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ డిజిఎం సంతోష్ కుమార్, ఏపీ మేనేజర్ కే. చంద్రశేఖర్, విజయవాడ ఎగ్జిక్యూటివ్ ఆర్ శ్యాం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

