జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు వేగవంతం
మచిలీపట్నం:
జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు వేగవంతం చేయాలని, బుధవారం రాత్రి కల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే మే నెల 1వ తేదీన పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలంలో పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బుధవారం ఉదయం మండలంలో ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ శాఖ అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. తొలుత కలెక్టర్ మండలంలోని కపిలేశ్వరపురం గ్రామంలో హెలిప్యాడ్, బారికేడ్లను పరిశీలించి ముఖ్యమంత్రి రాక కోసం వేచి ఉండే అతిధులకు, అధికారులకు నీడనిచ్చే షామియానా వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. తదుపరి పమిడిముక్కల గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ప్రజావేదిక నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.
ప్రాంగణంలో పనులు చాలా నిదానంగా జరుగుతున్నాయని ఎర్రమట్టి తోలకం, ప్రదర్శనశాలల ఏర్పాటు వేగవంతం చేయాలని. సూచించారు. అప్రోచ్ రహదారిని వెంటనే నిర్మించాలన్నారు. బుధవారం రాత్రికల్లా ఎట్టి పరిస్థితుల్లోనైనా పనులు పూర్తి చేయాలన్నారు.
భవన నిర్మాణ కార్మికులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించేందుకు వీలుగా జాబితా సిద్ధం చేయాలన్నారు. కార్మిక శాఖ పోర్టల్ లో వారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజా వేదికపై ముఖ్యమంత్రితో కూర్చునే లబ్ధిదారుల పేర్లను ఖరారు చేయాలన్నారు. వీరంకి లాకులలోని ఎన్టీఆర్ కాలనీలో ముఖ్యమంత్రి పంపిణీ చేసే పింఛను లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలన్నారు. శ్రమశక్తి బహుమతి గ్రహీతలను, మెటనెటి బెనిఫిట్స్ లబ్ధిదారుల జాబితా వెంటనే సిద్ధం చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలన్నింటిలో ఎక్కడా కూడా చెత్తచెదారాలు లేకుండా సజావుగా పారిశుధ్యం నిర్వహించాలన్నారు. ప్రజా వేదిక వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, సంచార మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు.
.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట రాష్ట్ర కార్మిక శాఖ వైద్య బీమా కమిషనర్ శ్రీ ఆంజనేయులు, ఉయ్యూరు ఇంచార్జ్ ఆర్డిఓ శ్రీ బాలసుబ్రమణ్యం, కార్మిక శాఖ డి సి ధనలక్ష్మి, ఆర్ & బి ఈఈ శ్రీ లోకేష్, డి ఈ బలరాం కార్మిక శాఖ ఏసి విష్ణు, తహసిల్దారు నవీన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

