రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకుంటే ఉపేక్షించం
SSN
- April 25, 2026
- 1 min read
[addtoany]
– పోర్టు రోడ్డులో అభివృద్ధి పనులపై వైసీపీ రాద్దాంతం సిగ్గుచేటు
– డ్రైనేజీ సమస్య పరిష్కారం లక్ష్యంగా పనిచేస్తుంటే విమర్శలా?
– ఎవరెన్ని కుట్రలు చేసినా బందరుని అభివృద్ధి చేసి చూపిస్తా
– పేర్ని కిట్టుపై మంత్రి కొల్లు రవీంద్ర పరోక్ష విమర్శలు
– మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో మంత్రి కొల్లు రవీంద్ర.
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ జవాబుదారీగా ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని దరఖాస్తుల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. మచిలీపట్నంలో 409 అర్జీలు వచ్చాయి. శాఖల అధికారులకు పంపించి పరిష్కరించాం. 57 దరఖాస్తులు మాత్రమే పెండింగులో ఉన్నాయి. ముఖ్యంగా పెన్షన్లు, ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు అధికంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేలో జాబ్ మేళా నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ఎంఎస్ఎంఈ, ఫిషరీస్, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం. రిజిస్టర్ చేసుకున్నవారికి ఉద్యోగ అవకాశాలతో పాటు శిక్షణ కూడా అందించేలా చర్యలు తీసుకుంటాం.
నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రపథంలో నిలపాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుంటే.. కొంత మంది రాజకీయం కోసం ఏదో ఒక రాద్దాంతం సృషించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు. బందరు అభివృద్ధిని అడ్డుకునేందుకు కూడా వెనుకాడకుండా వ్యవహరించడం దుర్మార్గం. పోర్టు రోడ్డులో ప్రధాన సమస్య మురుగు నీరు. అక్కడ గేదెలు ఎక్కువగా తిరుగుతుండడం, మురుగు పొలాల్లోకి వెళ్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ డ్రైనేజీ నీటి సమస్య పరిష్కారం కోసం రూ.50 కోట్ల వ్యయంతో రెండు ఎస్టీబీలు ఏర్పాటు చేస్తున్నాం. బందరు కోట నుండి పోర్టు రోడ్డు వైపు వెళ్లే మురుగు మొత్తాన్ని శుద్ధి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎంత పెద్ద వర్షం వచ్చినా మురుగు నీరు బందరులోకి రాకుండా చర్యలు తీసుకుంటే.. బందరు మునిగిపోతోందంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అభివృద్ధి చేయడం చేతకాదు, నిధులు తీసుకురావడం చేతకాదు. ఎవరైనా అభివృద్ధి చేస్తుంటే విమర్శలు చేయడం. ప్రజలకు మంచి చేస్తుంటే అండగా నిలవాల్సింది పోయి దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు.
మా తాత ముత్తాతల నుండి ఉన్న పొలాల కోసం నేడు ముంచేస్తున్నామంటూ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి రైతులు, ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బందరు మొత్తం మొక్కలు పెట్టిస్తే.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మీటింగుల పేరుతో చెట్లు మొత్తం నరికేశారు. రోడ్లు మొత్తం అభివృద్ధి చేస్తున్నాం.
కూటమి ప్రభుత్వానికి తెలిసిందంతా అభివృద్ధి చేయడమే. మీలా మాకు అభివృద్ధిని అడ్డుకోవడం, విధ్వంసం సృష్టించడం చేతకాదు. ఎన్ని విమర్శలు చేసినా, అధికారుల్ని బెదిరించినా, కులం పేరుతో కుట్రలకు పాల్పడినా.. మేం అభివృద్ధి వైపే అడుగులేస్తాం. అధికారుల్ని బెదిరించడం, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేయడం తప్ప పేర్ని ముఠా సాధించిందేంటి?
డ్రైనేజీని పూర్తి చేస్తాం. రోడ్ల పనులు చేస్తాం. పంచాయతీలకు రోడ్డు సదుపాయాలు కల్పిస్తాం. రూ.20 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపడతాం. పోలాటితిప్ప నుండి గరాలదిబ్బ రోడ్డు, నడమేరు-కొండేరు బ్రిడ్జికి రూ.18 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనుల్ని కూడా ప్రారంభించుకుంటాం. మా లక్ష్యం బందరు నియోజకవర్గ అభివృద్ధి. ఇప్పటికే బందరులో పేదలకు జీ+3 ఇళ్లు నిర్మించి అందించాం. ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేసి చూపిస్తాం. ఇప్పటికే మచిలీపట్నంలోని శివారు ప్రాంతాలకు కూడా తాగునీరు అందించేలా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశాం. బందరు పోర్టును పూర్తి చేసి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారుస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ , మోటమర్రి బాబాప్రసాద్ , కాగిత వెంకటేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

