టీచర్ టెక్నికల్ సర్టిఫికెట్ 42 రోజుల వేసవి శిక్షణ కోర్సును మే ఒకటి నుండి జూన్ 11 వరకు నిర్వహించనున్నట్టు కృష్ణాజిల్లా డీఈవో యు వి సుబ్బారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. శిక్షణా కేంద్రాలు విశాఖపట్నం కాకినాడ గుంటూరు, కడప అనంతపురంలలో ఉంటాయన్నారు. ఈ కోర్సులలో ప్రవేశాలు పొందదలిచిన అభ్యర్థులు మే ఒకటవ తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 45 ఏళ్లు మించకుండా ఉండాలన్నారు.
ఎస్ఎస్ సి లేదా సమానమైన పరీక్ష ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ వృత్తివిద్య కోర్సు ఉత్తీర్ణత, ఎస్ బి టి ఈ టి గుర్తించిన కోర్సులు ఐటిఐ ల ద్వారా పొందిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ హ్యాండ్లూమ్ వీవింగ్ వంటి జాతీయ సంస్థల సర్టిఫికెట్లు లేదా పరిశ్రమల శాఖ జారీ చేసిన సర్టిఫికెట్లు ఉండాలని తెలిపారు. అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయం లేదా సమాన సంస్థల నుండి కర్ణాటక సంగీతం గానం వాయిద్యం లలో డిప్లమా లేదా ఏదైనా విశ్వవిద్యాలయం నుండి ఫైన్ ఆర్ట్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఇతర రాష్ట్రాల అభ్యర్థులు తమ విద్యా సాంకేతిక అర్హతలను ఆంధ్రప్రదేశ్ వెలుపల బోర్డులు లేదా సంస్థలలో పొందినట్లయితే ప్రవేశానికి ముందు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల నుంచి అనుమతి పొందాలని సూచించారు. ఈ కోర్సుకు దరఖాస్తులు ఏప్రిల్ 26 వరకు స్వీకరిస్తామని తెలిపారు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.ap.gov.in ను సందర్శించాలన్నారు.