ప్రజా సమస్యలను చట్ట పరిధిలో పూర్తి విచారణ జరిపి పరిష్కారం అందించే లక్ష్యంతో “మీకోసం” కార్యక్రమ నిర్వహణ – జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు
మీకోసం కార్యక్రమానికి మొత్తం 42 ఫిర్యాదులు
మచిలీపట్నం :
ప్రజా సమస్యలను వాటి తీవ్రత ఆధారంగా చట్ట పరిధిలో పూర్తి విచారణ జరిపి పరిష్కారం అందించే లక్ష్యంతో మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, సమస్య ఏదైనా ధైర్యంగా వచ్చి తెలియజేయవచ్చని జిల్లా ఎస్పీ వి .విద్యాసాగర్ నాయుడుసోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “మీకోసం” కార్యక్రమంలో అన్నారు.
మీకోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు వారి సమస్యలకు సంబంధించి ఫిర్యాదులను అర్జీల రూపంలో ఎస్పీ కి నేరుగా అందజేయగా, వారితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్య తీవ్రత ఆధారంగా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారికి ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. మీకోసం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వహించవద్దని, వాటిని చట్ట పరిధిలో పూర్తి విచారణ జరిపి పరిష్కారం అందించే దిశగా కార్యచరణ రూపొందించాలని తెలిపారు.
మీకోసం కార్యక్రమంలో అందిన ఫిర్యాదులలో…
అవనిగడ్డ నుండి రమ్య అనే మహిళ వచ్చి తన భర్త మద్యానికి బానిసై నానా చిత్రహింసలు పెడుతుండడంతో, గడిచిన ఆరు నెలల కాలంగా వేరుగా జీవిస్తున్నామని, అయినా తన ప్రవర్తనలో మార్పు రాకపోగా మానసిక చిత్రహింసలకు గురి చేస్తున్నాడని న్యాయం చేయమని ఫిర్యాదు.
పామర్రు నుండి ప్రమీల అనే వివాహిత వచ్చి తనకు వివాహం జరిగి 2 సంవత్సరాలు అవుతుందని అదనపు కట్నం కోసం తన భర్త అత్తింటి వారు తీవ్రంగా వేధిస్తున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు.
చల్లపల్లి నుండి గంగాధరరావు అనే వృద్ధుడు వచ్చి తనకు ఇద్దరు సంతానం ఉండగా తన భార్య ఇటీవల మరణించిందని అప్పటినుండి తన పిల్లలు తన యొక్క యోగక్షేమాలు చూడకపోగా ఆస్తి మొత్తం తమ పేర రాయాలని వేధింపులకు గురి చేస్తున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు.

