మచిలీపట్నం :
వచ్చే మే నెల 3 వ తేదీన జరగనున్న నీట్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉన్నతాధికారులకు తెలిపారు. గురువారం మధ్యాహ్నం న్యూఢిల్లీ నుండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రాజేష్ లఖన్ నీట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ కళాశాల విద్య కమిషనర్ భరత్ గుప్తా తో కలిసి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయం నుండి పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో రెండు కేంద్రాలలో నీట్ పరీక్షలు నిర్వహించనున్నామని అందులో కేంద్రీయ విద్యాలయం, కృష్ణ విశ్వవిద్యాలయం ఉన్నాయన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేస్తున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్, నీట్ పరీక్షల నిర్వహణ సమన్వయకర్త మొహమ్మద్ ఆసిఫ్ హుస్సేన్, పరీక్ష కేంద్రం పర్యవేక్షకులు సత్యనారాయణ పాల్గొన్నారు.