విద్యార్ధులు చదువు పూర్తి చేసిన తర్వాత మంచి ఉద్యోగం సాధించి బయటకు వెళితే ముందు సంతోషించేది మీ తల్లిదండ్రులే అనే విషయాన్ని గుర్తించి ముందడుగు వేయాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ ఉద్బోధించారు. గురువారం హెటిరో డ్రగ్స్ కంపెనీ సౌజన్యం తో కృష్ణా విశ్వవిద్యాలయం ప్లేస్మెంట్ , ట్రైనింగ్ విభాగం చేపట్టిన ప్రాంగణ ఎంపికలు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశం ఫార్మా రంగానికి కేంద్రంగా మారిందని, నైపుణ్యం కలిగి ఉంటే ఉద్యోగం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ప్రాంగణ ఎంపికలు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ట్రైనింగ్, ప్లేస్మెంట్ విభాగం సమన్వయకర్త ఆచార్య వైకె సుందరకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎంవి. బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, ట్రైనింగ్, ప్లేస్మెంట్ విభాగం డైరెక్టర్ డాక్టర్ కిషోర్, హేటిరో డ్రగ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాంగణ ఎంపికల్లో 46 మంది ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బి ఫార్మసీ విద్యార్ధులు ఎంపికయ్యారు.