మా కోసం పర్యావరణాన్ని పరిరక్షించండి: చిన్నారి ఆద్యా పిలుపు
మచిలీపట్నం:
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భావితరాలకు స్వచ్ఛమైన, హరితమైన ప్రపంచాన్ని అందించేందుకు అందరూ కృషి చేయాలని చిన్నారి ఆద్యా పిలుపునిచ్చింది. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో మీకోసం కార్యక్రమం జరుగుతున్న సమయంలో కలెక్టరేట్ ఉద్యోగి నిడమనూరి ఆశా దీప్తి కుమార్తె, మూడవ తరగతి చదువుతున్న 8 సంవత్సరాల ఆద్య పర్యావరణ పరిరక్షణకు తనవంతుగా చేస్తున్న కృషిని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి చొరవతో జిల్లా అధికారులకు వివరించింది.
ఈ సందర్భంగా చిన్నారి మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తోందని పేర్కొంది. ప్లాస్టిక్ రహిత ప్రపంచ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ “ట్రిపుల్ ఆర్” (Reduce, Reuse, Refuse) సూత్రాలను పాటించాలని సూచించింది. అలాగే చెట్ల నరికివేత వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసిన చిన్నారి, విస్తృతంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో తాను సీడ్ బాల్స్ (విత్తనాలు ఉంచిన మట్టి ఉండలను) తయారు చేస్తున్నానని, వాటిని రహదారుల పక్కన ఉన్న ఖాళీ స్థలాలు, అనువైన ప్రాంతాల్లో వేస్తున్నానని వివరించింది. సీడ్ బాల్స్ ద్వారా ఎక్కువ సంఖ్యలో మొక్కలు పెరిగే అవకాశం ఉందని, ఇది పర్యావరణ పరిరక్షణకు సమర్థవంతమైన మార్గమని తెలిపింది. తన జనరేషన్తో పాటు భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సీడ్ బాల్స్ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని కోరింది.

పర్యావరణంపై అవగాహన పెంపొందిస్తూ, ప్రకృతి సంరక్షణకు వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్న చిన్నారి ఆద్యా ఆలోచనలను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పిజిఆర్ఎస్ సమావేశపు మందిరం వెలుపల జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు జిల్లా అధికారులు చిన్నారి తెచ్చిన గానుగ, చింత, నిద్ర గన్నేరు వంటి విత్తనాలను మట్టిలో ఉండలుగా చుట్టి సీడ్ బాల్స్ తయారు చేశారు.

