పిల్లల పెంపకంలో ఎదురవుతున్న సమస్యలు, మొబైల్ అడిక్షన్ నుంచి వారిని ఎలా దూరం చేయాలి అనే అంశాలపై స్థానిక బ్లోసమ్స్ బిజీ బడ్స్ ప్రీ స్కూల్ శుక్రవారం పాజిటివ్ పేరెంటింగ్ టాక్ షో నిర్వహించింది. నేటి తరం తల్లిదండ్రులకు పిల్లల పెంపకంలో ఎదురవుతున్న సవాళ్లపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అపర్ణ శ్రీవాత్సవ (చైల్డ్ సైకాలజీ & పేరెంటింగ్ కోచ్), యాస్మిన్ షరీఫ్ (ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్), డాక్టర్ ప్రియ మేఘన (చైల్డ్ డెవలప్మెంట్ థెరపిస్ట్) పాల్గొన్నారు. పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వాడకం, తల్లిదండ్రుల భాగస్వామ్యం, ఎమోషనల్ బాండింగ్, పాజిటివ్ డిసిప్లిన్ వంటి 10 కీలక అంశాలపై నిపుణులు లోతైన విశ్లేషణ చేశారు. తల్లిదండ్రులు అడిగిన పలు సందేహాలకు నిపుణులు పరిష్కారాలను సూచించారు.
ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకురాలు కన్య మాట్లాడుతూ, మచిలీపట్నంలో ఇటువంటి వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసి, పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడమే ఈ టాక్ షో ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.