మచిలీపట్నం :
జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, వారికి కావాల్సిన సహకారం అన్ని విధాల అందిస్తామని ప్రభుత్వ రాయితీలు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు.
శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతులు ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించి పరిశ్రమల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ డెస్క్ పాలసీ కింద జిల్లాలో 850 దరఖాస్తులు అందగా అందులో 755 దరఖాస్తులకు అన్ని రకాల అనుమతులు మంజూరు చేసి ఆమోదించామన్నారు. ఇంకను పెండింగ్లో ఉన్న 95 దరఖాస్తులను వేగవంత వాణిజ్యం కింద సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
పీఎం విశ్వకర్మ పథకం కింద 2079 దరఖాస్తులను రుణం మంజూరు కోసం బ్యాంకులకు పంపగా 897 దరఖాస్తులకు 8.26 కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు.
ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పీఎంఈజీపి పథకం కింద 239 దరఖాస్తులను రుణం మంజూరు కోసం బ్యాంకులకు పంపగా అందులో 142 యూనిట్లు నెలకొల్పడం జరిగిందన్నారు.
ఇటీవల విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఒప్పందం కుదుర్చుకున్న 12 భారీ కంపెనీలకు సంబంధించి అవసరమైన సౌకర్యాలను సత్వరమే కల్పించి పరిశ్రమలు నెలకొల్పుటకు చొరవ చూపాలన్నారు.
ర్యాంపు కార్యక్రమం ద్వారా పరిశ్రమల నెలకొల్పుటకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమాలు, కార్యశాలలు పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు.
అన్ని నియోజకవర్గాల్లో ఎం ఎస్ ఎం ఈ, నానో పార్కులు ఏర్పాటు చేయుటకు అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు.
పామర్రు నియోజకవర్గంలో అయినంపూడి 6.91 ఎకరాల్లో ఎంఎస్ఎమ్ఈ పార్క్ ఏర్పాటు చేయుటకు అన్ని పనులు వచ్చే మార్చి నెలాఖరిలోగా పూర్తి చేయాలన్నారు.
జిల్లాలో 5 ఎం.ఎస్.ఎం.ఇ యూనిట్ లకు
3 కోట్ల 97 లక్షల 40 వేల 467 రూపాయల పెట్టుబడి రాయితీ, అమ్మకం పన్ను తిరిగి చెల్లింపు రాయితీ, స్టాంపు డ్యూటీ తిరిగి చెల్లింపు రాయితీలు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఆర్ వెంకటరావు, ఏపీఐఐసీ జెడ్ ఎం బాబ్జి, కాలుష్య నియంత్రణ మండలి ఈ ఈ శ్రీనివాసరావు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.