మచిలీపట్నం:
కోవిడ్–19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్ పథకంతో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
కోవిడ్–19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రు లిద్దరినీ కోల్పోయిన పిల్లలకు జిల్లా కలెక్టర్ సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ప్రధానమంత్రి సమగ్ర సహాయాన్ని (పీఎం కేర్) అందించి వారితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు, బాగోగులను తెలుసుకున్నారు. వారిలో 18 సంవత్సరాలు నిండిన లబ్ధిదారులకు పోస్టల్ బ్యాంకు పాస్ పుస్తకాలను అందించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 28 మంది పీఎం కేర్స్ లబ్ధిదారులు ఉండగా, వారిలో 17 మంది ప్రస్తుత కృష్ణా జిల్లా, 8 మంది ఎన్టీఆర్ జిల్లా, ముగ్గురు ఏలూరు జిల్లాకు చెందినవారు ఉన్నారని అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్కు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్–19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సమగ్ర సంరక్షణ, రక్షణను అందించడం, ఆరోగ్య బీమా ద్వారా వారి శ్రేయస్సును నిర్ధారించడం, విద్య ద్వారా వారిని శక్తివంతం చేయడం, అదేవిధంగా 23 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఆర్థిక సహాయంతో స్వయం సమృద్ధిగా జీవించడానికి వారిని సన్నద్ధం చేయడం ఈ పీఎం కేర్ పథకం ముఖ్య లక్ష్యం అని తెలిపారు. అనాథలుగా మారిన పిల్లల విద్య, ఆరోగ్యం, వారి అభ్యున్నతి కోసం రూ. 10 లక్షల ఏకమొత్తం పీఎం కేర్ పథకం ద్వారా మద్దతును అందించి వారికి అండగా ఉంటుందన్నారు.
జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాని లక్ష్యసాధనకు శ్రమించాలని ఆయన ఈ సందర్భంగా వారికి ఉద్భోదించారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వారి రెజ్యూమ్ లను పంపించాలని సూచిస్తూ, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పనకు కృషి చేయాలని నైపుణ్య అభివృద్ధి అధికారికి కలెక్టర్ సూచించారు.
కార్యక్రమంలో సహాయ కలెక్టర్ ఫర్హిన్ జాహిద్, డిఆర్ఓ కే చంద్రశేఖరరావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ సువార్త, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, ఇంచార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరావు, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, నైపుణ్య అభివృద్ధి అధికారి నరేష్ కుమార్, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ సతీష్, డీసీపీఓలు, సిడిపిఓలు, లబ్ధిదారుల సంరక్షకులు తదితరులు పాల్గొన్నారు.