కృష్ణాజిల్లా మచిలీపట్నం నగరంలో అరుదైన ప్రకృతి వైవిధ్యం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఉష్ణమండల తడి ప్రాంతాల్లో పెరిగే అనాసపండు (పైనాపిల్) మొక్క, ఇక్కడి నేలలో పెరగడం విశేషంగా మారింది. మచిలీపట్నం ఈడేపల్లి ప్రాంతానికి చెందిన వర్రె రాజ్యలక్ష్మి ఇంటి పెరట్లో అనాస మొక్క పెరిగి, పండు ఇచ్చిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని, నిజంగా అనాసపండు మొక్కేనా అని ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. స్థానికంగా “బందరు నేలలో పైనాపిల్ ఎలా పెరిగింది?” అనే సందేహం అందరిలో నెలకొంది. సాధారణంగా ఇలాంటి పంటలు అధిక తేమ, ప్రత్యేకమైన మట్టి లక్షణాలు అవసరం పడతాయి. కానీ మచిలీపట్నం నేలలో ఈ మొక్క పెరగడం అరుదైన సంఘటనగా భావిస్తున్నారు.
ఇంటి యజమాని వర్రె రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, ఈ మొక్కను ఎంతో శ్రద్ధగా పెంచినట్లు తెలిపారు. మొక్కకు తగిన రక్షణ కల్పిస్తూ, నీరు, ఎరువులు సమయానికి అందించడంతో ఇది సఫలీకృతమైందని చెప్పారు.ఈ ఘటనతో మచిలీపట్నం ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ప్రకృతి వైవిధ్యానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తూ, సరైన సంరక్షణ ఉంటే ఏ ప్రాంతంలోనైనా విభిన్న పంటలు పెంచవచ్చనే నమ్మకాన్ని కలిగిస్తోంది.