బందరు బీచ్ సమీపాన సినీ స్టూడియో: మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం :
బందరు బీచ్ సమీపాన సినీ స్టూడియో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, మచిలీపట్నం రూపు రేఖలు త్వరలో మారనున్నాయని, బందరును భవ్య నగరంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీచ్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి, పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరేందుకు అత్యాధునిక సౌకర్యాలతో త్రీ-స్టార్, ఫైవ్-స్టార్ హోటళ్ల నిర్మాణానికి మైరా సంస్థకు 20 ఎకరాల భూమి కేటాయించినట్లు మంత్రి రవీంద్ర పేర్కొన్నారు.
కాగా కృష్ణాజిల్లాలో షూటింగుకు అనువైన ప్రదేశాలు ప్రకృతి రమణీయతకు అనుకూల ప్రదేశాలు ఉన్నాయి. గతంలో మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో పాండురంగ మహత్యం, దేవుడు చేసిన మనుషులు ఇలాంటి చిత్రాలతో పాటు పలు లఘు చిత్రాలు లోబడ్జెట్ తో నిర్మించారు. మచిలీపట్నం బీచ్ తో పాటు హంసలదీవి, మోపిదేవి, కృత్తివెన్ను మండలంలో చినగొల్లపాలెం, ఘంటసాల, మొవ్వ, తదితర ప్రాంతాల్లో షూటింగుకు అనువుగా రమణీయ ప్రదేశాలు ఉన్నాయి. మంత్రి కొల్లు రవీంద్ర ఆశించినట్లుగా కృష్ణాజిల్లాలో పలు చిత్రాల నిర్మాణాలు కనుక జరిగితే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుంది. తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. కొత్త కళాకారులను కూడా ప్రోత్సహించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి.

