కృష్ణా యూనివర్సిటీలో ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులకు శుక్రవారం నాడు ప్రాంగణ ఎంపికల కార్యక్రమాన్ని వర్సిటీ ఉపకులపతి ఆచార్య కే రాంజీ లాంఛనంగా ప్రారంభించారు.
టాటా ఎలక్ట్రానిక్స్, కియా మోటార్స్ వంటి 10కి పైగా ప్రముఖ సంస్థలు కృష్ణా యూనివర్సిటీకి విచ్చేసి విద్యార్థులను ఎంపిక చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టాయి..
ఈ సందర్భంగా వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె రాoజీ మాట్లాడుతూ గత సంవత్సరం వర్సిటీలో జరిగిన ప్రాంగణ ఎంపికలలో కూడా 100% విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, అదే సంకల్పంతో ఈ సంవత్సరం కూడా ప్రతి విద్యార్థికి ఉద్యోగావకాశం కల్పించి ఈ నెలాఖరులో అచీవర్స్ డే పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పిలిపించి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని విద్యార్థుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. ప్రాంగణ ఎంపికల్లో వర్సిటీ లోని వివిధ కళాశాలల నుండి దాదాపు మూడు లక్షల ప్యాకేజీతో 228 మందిని ఫైనల్ రౌండ్ కి ఎంపిక చేసినట్టు యూనివర్సిటీ ప్రాంగణ ఎంపికల డైరెక్టర్ ఆచార్య వై కె. సుందర కృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎం.వి బసవేశ్వర రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష, పలు కళాశాలల ప్రాంగణ ఎంపికల ఇన్చార్జులు పాల్గొన్నారు.