విద్యార్ధులు పుస్తక పఠనం ను ఆసక్తిగా ఎంచుకోవాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ పేర్కొన్నారు. గురువారం విశ్వవిద్యాలయ సెంట్రల్ లైబ్రరీ లో నిర్వహించిన ప్రపంచ పుస్తక దినోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ రోజు ప్రముఖులుగా ఆరాధించబడుతున్న ప్రతి ఒక్కరూ పుస్తకాలను ఆసక్తి గా చదవడం వల్ల ఆ స్థాయికి చేరుకున్నారని వివరించారు. సాంకేతికత పెరిగి ఫోన్లు, కంప్యూటర్లు తో కాలక్షేపం చేస్తున్నా పుస్తక పఠనం ను కూడా దిన చర్యలో భాగంగా మలచుకోవడం అవసరమన్నారు. తద్వారా ఒత్తిడి తగ్గించుకోవడం సాధ్యమవుతుందన్నారు.
రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో భాషా పరిజ్ఞానం చాలా అవసరమని, అది పుస్తక పఠనం ద్వారానే పెంచుకోగలమన్నారు. తెలుగు తో పాటు ఆంగ్లం, హిందీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకుంటే ఉత్తర భారతదేశం తో పాటు విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు.
డా. ఏపిజే. అబ్దుల్ కలాం సెంట్రల్ లైబ్రరీ సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ డిప్యూటీ లైబ్రేరియన్ రమణ, కృష్ణా విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు సహాయ ఆచార్యులు వరుణకుమారి లు గ్రంథాలయాల ఆవశ్యకత, పుస్తక పఠనం పై ప్రసంగించారు. ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాల ల విద్యార్థులు తో పాటు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్ధులు ప్రపంచ పుస్తక దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని తమదైన శైలిలో ప్రసంగించారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తాళపత్ర గ్రంథాలు, భారత రాజ్యాంగం తో పాటు అరుదైన, విలువైన పుస్తకాల తో ఏర్పాటు చేసిన ప్రదర్శన ను విద్యార్ధులు ఆసక్తిగా తిలకించారు.