విశ్వంలో భూమి కి మించిన దేవుడు లేడు అని కృష్ణా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వైకే సుందరకృష్ణ పేర్కొన్నారు. బుధవారం ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యములో నిర్వహించిన ప్రపంచ ధరిత్రి దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ తన బాల్య దశలో దాహం వేస్తే కాలువల్లో పారుతున్న నీటిని దోసిట్లో తీసుకుని తాగేవారమని, నేడు ఆ పరిస్థితి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ప్రజలు బాధ్యతారాహిత్యం వల్లే గాలి, నీరు సైతం కలుషితం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పుడే మార్పు సాధ్యం అవుతుందన్నారు.
ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారిణి డా. సల్మా బేగం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బయో టెక్నాలజీ, బయో సైన్సెస్ విభాగం అధిపతి ఆచార్య మారుతి ప్రధానోపన్యాసం చేశారు. ఎన్ ఎస్ ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారి డా. రవి తదితరులు పాల్గొన్నారు. తొలుత విశ్వవిద్యాలయ ప్రాంగణం లో రెక్టర్ ఆచార్య ఎంవి బసవేశ్వరరావు మొక్కలు నాటారు.