నగరంలో శనివారం తీవ్ర ఉద్రిక్తతల నడుమ జనసేన పార్టీ జెండా రామానాయుడుపేట సెంటర్ వద్ద ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆవిష్కరించారు.
రామానాయుడుపేట సెంటర్ మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) ఇంటికి సమీపంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణకు గత రెండు రోజుల నుండి జనసేన పార్టీ సమాయత్తం అవుతూ ఎట్టకేలకు వారి పంతం నెగ్గించుకుంది. జనసేన పార్టీ రామానాయుడుపేట సెంటర్ సమీపంలో జెండా ఏర్పాట్లు చేయకుండా వైఎస్ఆర్సిపి నాయకులు గత రెండు రోజుల నుండి ఆందోళన చేపట్టారు. ఇటు జనసేన నాయకులు, అటు వైయస్సార్సీపి నాయకుల నడుమ పోలీసులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.
చట్ట ప్రకారం, న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాయడం సరైన చర్య కాదని పేర్ని నాని నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు మచిలీపట్నం అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్ అరెస్టుతో నగరంలో అలజడి చెలరేగింది. పేర్ని నాని , బందరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ పేర్ని కిట్టు, పెడన నియోజకవర్గ ఇంచార్జి ఉప్పాల రాము తదితర నాయకులు శుక్రవారం పోలీసుల చర్యకు తీవ్ర ఆందోళనలు చేపట్టడంతో ఎట్టకేలకు అరెస్టు చేసిన బొర్రా విఠల్ ను రాత్రికి విడుదల చేయడం జరిగింది.
నగరంలో జనసేన ఆవిర్భావ దినోత్సవంలో ఎంపీ బాలశౌరి ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బందరు ఎంపీ వల్లభనేని బాలసౌరి మాట్లాడుతూ తాము న్యాయబద్ధంగా రామానాయుడుపేట సెంటర్ వద్ద జనసేన పార్టీ జెండా ఎగరవేయడానికి ఏర్పాట్లు చేసుకుంటే, వైయస్ఆర్సీపీ నాయకులు అడ్డుపడడం తగదని హితవు పలికారు. తాము కూడా జనసైనికుల అండతో, మద్దతుతో ఎంత దూరమైనా వెళ్తామని బాలశౌరి హెచ్చరించారు.
ఈ సందర్భంగా రామానాయుడుపేట సెంటర్లో జనసేన పార్టీ దిమ్మ ఏర్పాటు చేయడం, జనసేన జెండా ఎగరవేయడం, తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నగరంలో రామానాయుడుపేట సెంటర్లో పోలీస్ పహార నడుమ జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ పూర్తయింది. ఉదయం నుండి తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఈ కార్యక్రమం కొనసాగింది.