– 20 కోట్లతో అభివృద్ధి పనులు
– 39 కోట్ల పనులకు ప్రతిపాదనలు
– విజయవాడలో పీజీ సెంటర్ ఏర్పాటు
– నూరుశాతం ఉద్యోగాలు
కృష్ణా విశ్వవిద్యాలయం: కృష్ణా విశ్వవిద్యాలయం సర్వతోముఖాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య కె. రాంజీ స్పష్టం చేశారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పదవి బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భముగా మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం లో ఆయన మాట్లాడారు. గడిచిన ఏడాది కాలంలో జపాన్ , స్వీడన్ దేశాల్లోని విదేశీ విశ్వవిద్యాలయాల తో పాటు దేశం లో భారత్ ఎలెక్ట్రానిక్స్, రాజ్య సైనిక్ బోర్డు లాంటి పలు ప్రతిష్టాత్మక సంస్థల తో అవగాహన ఒప్పందాలు చేసుకోవడం జరిగిందన్నారు.
పిఎం ఉషా పథకం కింద మంజూరైన 20 కోట్లు రూపాయలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఆలాగే విశ్వవిద్యాలయం లో క్రీడా ప్రాంగణం అభివృద్ధికి ఖేల్ ఇండియా పథకం కింద 39 కోట్ల రూపాయల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం కు పంపించడం జరిగింది అని చెప్పారు.
విశ్వవిద్యాలయం లో చదువుతున్న ప్రతి విద్యార్ధి ఉద్యోగం సాధించి బయటకు వెళ్లేలా క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించి గత ఏడాది నూరు శాతం ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది అన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ల చేతులమీదుగా నియామక పత్రాలు అందచేయడం జరిగిందని వివరించారు.
ఈ ఏడాది కాలంలో స్నాతకోత్సవం, కృష్ణా తరంగ్ యూత్ ఫెస్టివల్ విజయవంతంగా నిర్వహించడం తో పాటు ఇప్పుడు విజయవాడ లో అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల మహిళల నెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహించబడుతోంది అని చెప్పారు.
ఎన్ టి ఆర్ జిల్లా విద్యార్ధుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విజయవాడలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నాటికి బాలికల వసతి గృహం, ఫార్మసీ కళాశాల భవనాలను ప్రారభిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఫుడ్ కోర్టు ను ప్రారంభించి విద్యార్దులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు.
ఈ సమావేశంలో రెక్టర్ ఆచార్య ఎంవి. బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష లు మాట్లాడుతూ విద్యార్ధుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు.