MachilipatnamLocal News
February 28, 2026
కృష్ణా జిల్లా

రాష్ట్ర బడ్జెట్ పై సర్వత్రా హర్షం

  • February 19, 2026
  • 1 min read
[addtoany]
రాష్ట్ర బడ్జెట్ పై సర్వత్రా హర్షం
దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన
 
బలహీన వర్గాల ఆకాంక్షాలకు అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపులు
 
మచిలీపట్నం :
 
        రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా, భవిష్యత్ కు భరోసా ఇచ్చేలా బడ్జెట్ ఉందని కృష్ణా జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు ,ఆంధ్రప్రదేశ్ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి అన్నారు. 
 
        2026-2027 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మీడియా సమావేశంలో గురుమూర్తి మాట్లాడారు. స్వర్ణాంధ్ర -2047 లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా వేసిన బలమైన అడుగు ఈ బడ్జెట్ అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సాగు నీరు, విద్య, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ రంగాలను బలోపేతం చేసే విధంగా నిధులు కేటాయించారని తెలిపారు. 
 
         ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిన బడ్జెట్ ఇది అని అన్నారు. అదేవిదంగా రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన మూలధన వ్యయానికి రూ.53,915 కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,598 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు రూ.18,224 కోట్లు కేటాయించడం రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 
 
        జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో గృహనిర్మాణానికి రూ.6,357 కోట్లు కేటాయించారని తెలిపారు. సంక్షేమానికి మొత్తం రూ.91,527 కోట్లు కేటాయించగా, బీసీల అభివృద్ధికి రూ.51,021 కోట్లు, ఎస్టీలకు రూ.9,190 కోట్లు, మైనార్టీలకు రూ.6,090 కోట్లు, మహిళా–శిశు–వికలాంగుల సంక్షేమానికి రూ.4,582 కోట్లు కేటాయించారని వివరించారు. విద్యా రంగానికి భారీ ప్రాధాన్యం ఇస్తూ పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధికి గణనీయ నిధులు కేటాయించారని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు రూ.27,719 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.22,942 కోట్లు, వైద్యశాఖకు రూ.19,306 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి రూ.11,000 కోట్లు కేటాయించారని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,600 కోట్లు కేటాయించడం రైతులకు పెద్ద ఊరట కలిగిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం అధిక వడ్డీతో అప్పులు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం వడ్డీభారం తగ్గించిందని తెలిపారు. వివిధ విభాగాల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్టు పేర్కొన్నారు. విజన్ 2047 లక్ష్యంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, వ్యవసాయం విద్య వైద్యం రంగాలను బలోపేతం చేసి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులను ఆకర్షించే విధంగా బడ్జెట్ రూపొందించిందన్నారు. ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపే ప్రగతి సాధక ప్రజా బడ్జెట్ అని వీరంకి వెంకట గురుమూర్తి గారు అన్నారు.
 
         ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మోటమర్రి బాబా ప్రసాద్, జిల్లా కార్యాలయ కార్యదర్శి బత్తిన దాస్,అధికార ప్రతినిధి కోస్తా మురళి,కార్యానివాహక కార్యదర్శి వసంత కుమారి,చిల్లిముంత ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *