శాస్త్ర సాంకేతిక రంగం లో భారత దేశం అద్భుతాలు సృష్టిస్తుందని, నాసా తో పోటీ పడే స్థాయికి వెళ్ళిందని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భముగా శనివారం కృష్ణా విశ్వవిద్యాలయం లో సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు భారతదేశానివే అని, సాంకేతిక రంగం లో అమెరికా, చైనా లను అధికమించడం తధ్యం అన్నారు. దేశంలో యువశక్తి అధికంగా ఉండటమే గొప్పవరం ఆనీ చెప్పారు.
ప్రత్యేక అతిథిగా విచ్చేసిన బెల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫణికుమార్ మాట్లాడుతూ ప్రకృతితోనే సైన్స్ ముడిపడి ఉందన్నారు. నేడు బెల్ కంపెనీ ఆప్టికల్స్ విభాగం లో అద్భుతమైన ప్రగతి సాధించడానికి కారణం పరిశోధనలు చేయడమేనని చెప్పారు. ఎస్ ఎస్ డి పాలిమర్స్ డైరెక్టర్ డాక్టర్ దత్తప్రసాద్ మాట్లాడుతూ ఏ దేశానికి లేని యువశక్తి భారత దేశానికి అద్భుత శక్తిగా మారబోతుందన్నారు. తమ కుటుంబానికి శాస్త్ర సాంకేతిక రంగం పై ఉన్న మక్కువతో మచిలీపట్నం లో ఆంధ్రా సెంటిఫిక్ కంపెనీ ఏర్పాటులో రామ్మూర్తి పంతులు తో తమ తండ్రి భాగస్వాములయ్యారున్నారు.
బయో టెక్నాలజీ, బయో సైన్సెస్ విభాగం అధిపతి ఆచార్య మారుతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎంవి. బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష తదితరులు ప్రసంగించారు. తొలుత సర్ సి వి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సైన్స్ ఎక్స్పో లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.