మచిలీపట్నం:
స్థానిక చలరాస్తా సెంటర్లో పండ్ల వ్యాపారిపై స్నేహితుడు కత్తితో దాడి చేసి అమానుషంగా ప్రవర్తించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. సేకరించిన సమాచారం ప్రకారం చల్లపల్లి పవన్ బాబు, వక్కలగడ్డ సాయి అనే ఇరువురు స్నేహితులు. ఈ ఇద్దరి మధ్య పాత గొడవలు నేపథ్యంలో శుక్రవారం చలరాస్తా సెంటర్ వద్ద చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ హత్యాయత్నానికి దారితీసింది. సాయి అనే యువకుడు విజయవాడ నుంచి పూటుగా మద్యం సేవించి తనతో తెచ్చుకున్న కత్తితో పవన్ బాబు పై దాడి చేశాడు అని స్థానికులు తెలిపారు. ఈ దాడిలో ముఖం నుండి పొట్ట వరకు కత్తి చీరుకొని బాబు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన బాబును స్నేహితులు హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు పరిస్థితి విషమించడంతో విజయవాడకు రిఫరల్ చేశారు.
ఘటనలో అడ్డొచ్చిన మరికొంత మందిపై కూడా సాయి కర్రతో దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఇరువురి మధ్య ఘర్షణ లో నిందితుడు సాయి చేతికి కూడా గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న సాయి మాత్రం ముందుగా తనపై బాబు దాడి కి పాల్పడ్డారని ఆరోపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. నిందితుడను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఇనకుదురు పేట పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.