బందరు ఓడరేవుకు అనుసంధానంగా రైల్వేవంతెనల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే అందజేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో రెవెన్యూ, రైల్వే, రహదారులు భవనాలు తదితర శాఖల అధికారులతో వంతెనల నిర్మాణం పై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బందరు ఓడరేవుకు అనుసంధానంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి )తో పాటు రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్ యు బి) లను నిర్మించాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన అంచనాలతో కూడిన ప్రతిపాదనలను సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు సిద్ధం చేసి వెంటనే అందజేయాలన్నారు.
అలాగే భూసేకరణకు వాటి విలువలతో కూడిన అంచనాలను, రెవెన్యూ అధికారులు, విద్యుత్ సరఫరాకు అవసరమయ్యే ప్రతిపాదనలను విద్యుత్ శాఖ అధికారులు రూపొందించి అందజేయాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, మచిలీపట్నం ఆర్డిఓ పోతురాజు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఇ సోమశేఖర్, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.