సముద్ర జలాల్లో ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి నుండి ప్రభుత్వం చేపల వేటని నిషేధించింది. మేకనైజ్డ్ మోటార్ బోట్లలో మత్స్యకారుల చేపల వేట పై నిషేధం అమలులో ఉంటుంది. ఏపీ మత్స్య క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం జూన్ 14 వరకు అనగా 61 రోజులు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ కాలంలో మత్స్యకారులు సముద్రంలో చేపలు, రొయ్యలు వేటలను పూర్తిగా నిలిపివేయాలన్నారు. ఇంజన్ లేని సాంప్రదాయపడవలకి మాత్రం ఈ నిషేధం వర్తించదన్నారు. చేపలు, రొయ్యల సంతానోత్పత్తి సమయం కాబట్టి తల్లి జాతిని సంరక్షించడమే ప్రధాన లక్ష్యంగా చేపల జనాభా పెరుగుదలను ప్రోత్సహించడం అనే సత్సంకల్పంతో సముద్రపు మత్స్య సంపద సుస్థిరత సాధించడం కోసం ప్రత్యేక వేటనిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కాలంలో చేపల వేట చేయకుండా మత్స్యకారులు మత్స్య సంపద అభివృద్ధికి సహకరించాలని చట్టాన్ని అతిక్రమించి చేపల వేట సాగిస్తే శిక్షార్హులవుతారని అధికారులు తెలిపారు.