మచిలీపట్నం:
జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు తక్షణం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు.
మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ జిల్లాలోని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనల తయారీపై నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సమగ్ర అభివృద్ధి కోసం ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, గుడివాడ, పామర్రు, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలకు సంబంధించిన సీసీ, బీటీ రహదారుల అభివృద్ధి, సీసీ డ్రైన్లు, ఇంటింటి నీటి కొళాయి కనెక్షన్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు తదితర మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రాధాన్యత ప్రతిపాదనల తయారీపై చర్చించారు.
జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు పైన తెలిపిన విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని, తద్వారా వాటిని ప్రభుత్వానికి నివేదించి నిధుల మంజూరును కోరటం జరుగుతుందని తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనల్లో ఆయా పనుల వల్ల ప్రయోజనం పొందే ప్రాంతాలు, లబ్ధి పొందే జనాభా, పనుల ప్రాముఖ్యత వంటి అంశాలను స్పష్టంగా పేర్కొంటూ సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.
సమావేశంలో ట్రైనీ కలెక్టర్ నమ్రత అగర్వాల్, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు జెడ్పీ సీఈవో డాక్టర్ జే అరుణ, డ్వామా పీడీ ఎన్ శివప్రసాద్ యాదవ్, మార్కెటింగ్ ఏడి నిత్యానంద్, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు షేక్ షాహిద్ బాబు, పశుసంవర్ధక శాఖ అధికారి చిన నరసింహులు, మెప్మా పిడి సాయిబాబు, మార్క్ఫెడ్ డిఎం మురళీ కిషోర్, గణాంక అధికారి అధికారిణి కే పద్మజ తదితరులు పాల్గొన్నారు.