[addtoany]
మచిలీపట్నం :
నగర ప్రజలు స్వచ్ఛ సైనికులుగా తయారై పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎం నవీన్ పిలుపునిచ్చారు.
బుధవారం ఉదయం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ నగరంలోని 44 వ డివిజన్ గాది రెడ్డి గారి వీధి లో డాక్టర్ మల్లికార్జున రావు ఆసుపత్రి సమీపంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ స్వయంగా పట్టకారు లాంటి స్వచ్ఛ ఆయుధాన్ని చేత పట్టుకొని మునిసిపల్ కమిషనర్, సహాయ కమిషనర్, స్వచ్ఛ సైనికులు, పారిశుద్ధ కార్మికులతో కలిసి అక్కడ ఉన్న చెత్తాచెదారాలను తొలగించి శుభ్రం చేశారు
అనంతరం ఆ ప్రాంతానికి జెసిబి ని రప్పించి మట్టిని తొలగించి మరల చెత్త వేయకుండా అక్కడ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
తదనంతరం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్ఫూర్తితో నగరంలో బ్లాక్ స్పాట్లను గుర్తించి పరిశుభ్రం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.
రహదారుల ప్రక్కన చెత్తాచెదారాలు నెలలు తరబడి పేరుకుపోయి ఉన్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించామన్నారు. వాటిని పరిశుభ్రం చేసి మళ్లీ చెత్త అక్కడ వేయకుండా గ్రీన్ స్పాట్లుగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
స్థానికంగా ఉన్న మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ తరఫున స్వచ్ఛ సైనికులు ముందుకు వచ్చి తమతో పాటు స్వచ్ఛ సర్వేక్షన్ లో పాల్గొనడం అభినందనీయమన్నారు.
ప్రజలలో తప్పకుండా మార్పు రావాలని కాలువల్లో ఎవరూ కూడా చెత్త వేయరాదన్నారు.
నగరంలో ప్రజలు చాలాచోట్ల చెత్తాచెదారాలు ఎక్కడపడితే అక్కడ ముఖ్యంగా రహదారులు పక్కన, కూడళ్ల వద్ద, కాలువల్లో వేయడం జరుగుతుందన్నారు.
ఆ విధంగా చేయడం వలన పర్యావరణానికి ముప్పు వాటిల్లడమే కాకుండా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారనీ హెచ్చరించారు.
పరిసరాలు కలుషితం కాకుండా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.
ప్రజలలో తప్పకుండా మార్పు రావాలన్నారు చెత్తను కాలువల్లో గాని రహదారుల పక్కలో గాని వేయరాదన్నారు
ఇకపై అలా చేయకుండా ప్రజలు బాధ్యత వహించి వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా వారి ఇంటిలోని చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి ఉంచుకోవాలని మునిసిపల్ స్వచ్ఛ రథం వారి వద్దకు వచ్చినప్పుడు ఆ చెత్తను పారిశుధ్య కార్మికులకు అందజేయాలన్నారు.
పర్యావరణం ఆహ్లాదకరంగా ఉంటే పిల్లలకు, పెద్దలకు ఆరోగ్యం బాగుంటుందన్నారు.
అపార్ట్మెంట్లు వద్ద కూడా చెత్త కనిపిస్తోందని అపార్ట్మెంట్లోని ప్రజలు అంతర్గతంగా సమావేశమై చెత్త నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలన్నారు.
పరిశుభ్రం చేసిన ప్రదేశాలలో మరల ఎవరైనా చెత్త వేసిన ఎడల బాధ్యులైన వారిపై తీవ్రంగా శిక్షలు విధించబడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, సచివాలయ కార్యదర్శి నలిని, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కిషోర్ బాబు ప్రతినిధులు రాంబాబు, ముదిగొండ శాస్త్రి తదితరులు పలువురు మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

