రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్న దృష్ట్యా అందుకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి కలెక్టర్ల కాన్ఫరెన్స్కు అవసరమైన నివేదికలపై జిల్లా అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్కు అవసరమైన వివరాలతో కూడిన నివేదికను సత్వరమే తయారుచేసి సిపిఓ కు అందజేయాలన్నారు. ముఖ్యంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి కీలక పనితీరు సూచికలు (కే పి ఐ )ప్రకారం లక్ష్యాలు, సాధించిన ప్రగతి, ఏమైనా లోటుపాట్లు ఉంటే అందుకు గల కారణాలు వివరిస్తూ నివేదికలు అందజేయాలన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖలు క్షేత్రస్థాయిలో అందిస్తున్న పలు రకాల సేవలపై ప్రజల సానుకూల దృక్పథం (పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్) ఎలాగుంది, అందులో పేలవమైన పనితీరు కనపరిచే ప్రదేశాలు, అందుకు గల కారణాలు, పనితీరు మెరుగుపరిచేందుకు తీసుకోవలసిన చర్యలపై నివేదిక అందజేయాలన్నారు.
గత కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రస్తావించిన అంశాలపై వివరాలను అందజేయాలన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వారి శాఖకు సంబంధించిన సంక్షిప్త వివరాలను కూడా అందజేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల నుండి నివేదికలు అందిన తర్వాత జిల్లాకు సంబంధించిన సమగ్ర నివేదికను తయారు చేయాలని కలెక్టర్ సిపిఓ కు సూచించారు. ఈ వర్చువల్ కాన్ఫరెన్స్లో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డిఆర్ఓ చంద్రశేఖర రావు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.