విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరుపై అవగాహన
మచిలీపట్నం, 6మార్చి 2026, SSN:
మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ పెరేడ్ మైదానంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమానికి మచిలీపట్నం పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినిలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారికి పోలీస్ శాఖలో వినియోగిస్తున్న ఆయుధాలు, వాటి పనితీరు గురించి అధికారులు వివరంగా అవగాహన కల్పించారు. అలాగే పోలీస్ శాఖలో ఉన్న వివిధ విభాగాలు, వాటి విధులు, చట్టం, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర వంటి అంశాలపై కూడా విద్యార్థులకు తెలియజేశారు.
పోలీసులు శాంతిభద్రతలు కాపాడటానికి, సంఘవిద్రోశక్తులను నిరోధించడానికి వినియోగించే అత్యాదునిక ఆయుధాలు, AK-47, మెషిన్ గన్లు, రివాల్వర్లు పిస్టల్ లు, గ్రేనేడ్లు, టియర్ గ్యాస్ షెల్, వైర్ లెస్ సెట్, డిహెచ్ఎండి, హెచ్ హెచ్ఎండి, బాంబు డిస్పోజల్ సిబ్బంది వినియోగించే పరికరాలు, డాగ్ స్క్వాడ్ వారు వినియోగించే పరికరాలు, పోలీసు జాగిలాల గురించి వివరించారు.
ఎస్పీనే స్వయంగా వివిధ రకాల ఆయుధాల పనితీరు ఏ విధంగా ఉండేది, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి మొదలైన విషయాలను విద్యార్థులకు వివరించారు. కొన్ని ఆయుధాలను ఎస్పీ స్వయంగా టార్గెట్ పై ఉపయోగించి అవి ఎలా పని చేస్తాయి, వాటితో జనసమూహం అధికంగా గుమిగూడినప్పుడు ఏ విధంగా చెదరగొట్టవచ్చు అనే విషయాలు విద్యార్థులకు తెలిసేలా ప్రదర్శించారు. విద్యార్థులు ఆద్యంతం ఆసక్తితో మరిన్ని ప్రశ్నలు అడిగి వాటి గురించి అదనపు సమాచారం తెలుసుకున్నారు.విద్యార్ధిని లు వాటి పని తీరు తెలుసుకొని, ఆనందం వ్యక్తం చేసారు.
పోలీస్ జాగిలాలు యొక్క ప్రదర్శన ఆద్యంతం విద్యార్థులను ఆకట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏ ఆర్ సత్యనారాయణ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వై సత్య కిషోర్ , ఇన్స్పెక్టర్లు అబ్దుల్ నబీ , వాసా వెంకటేశ్వరరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ రాఘవయ్య , ఎస్సైలు , ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.