పల్లె పండుగ కార్యక్రమం ద్వారా మోపిదేవి మండలంలో విస్తృతంగా రహదారుల నిర్మాణం మొదలైంది. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తమ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా విడుదల చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.2.44 కోట్లతో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో ఆరు రోడ్లను మంజూరు చేశారు. తద్వారా రూ.97లక్షలతో మండల పరిధిలోని మోపిదేవి – వెంకటాపురం మధ్య 2.3కిలోమీటర్ల బీటీ ప్రధాన రహదారి నిర్మాణ పనులను సోమవారం చేపట్టారు. జడ్పీటీసీ మెడబలిమి మల్లికార్జునరావు, టీడీపీ మండల అధ్యక్షులు నడకుదుటి జనార్ధనరావు, మాజీ సీడీసీ చైర్మన్ రావి నాగేశ్వరరావు, సొసైటీ చైర్మన్ పరుచూరి శ్రీనివాసరావు పూజలు చేసి పనులను ప్రారంభించారు.
మండల పరిధిలోని ఎన్.హెచ్-216 నుంచి కొక్కిలిగడ్డ వరకు 1.15 కిలోమీటర్ల బీటీ రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎన్ఆర్ఆజీఎస్ నిధులు రూ.49 లక్షలతో చేపట్టిన పనులను గ్రామ సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు, ఎంపీటీసీ సభ్యురాలు దిడ్ల రాణి పూజలు చేసి ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.15లక్షలు కేటాయించిన జడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు పనులను పరిశీలించారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రావి రత్నగిరి, మాజీ సర్పంచ్ కేసాని శివుడు, జనసేన మండల అధ్యక్షుడు పూషడపు రత్నగోపాల్, ఎంపీటీసీ సభ్యులు సనకా వెంకట రాజేష్, మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు చందన రంగారావు, పంచాయతీ కార్యదర్శి చందన దేవి నాగరాజవతి, కంచర్ల శ్రీను, కేసాని శ్రీను పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖ డీఈఈ పగడాల సురేష్ బాబు, ఏఈఈ బొప్పన శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు.